సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మా ర్పులు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి సభల్లో ఆయన మాట్లాడుతూ.. ‘మొట్టమొదట వచ్చిన వ్యవసాయ విప్లవం లో భాగంగా అనాగరికమైన పద్ధతి ఉండొద్దు. చాలా మంచి పంటలు పండియ్యాలె అని నాటువేసే ప్రక్రి య కనిపెట్టిన్రు. నాటు వేయడం ద్వారా పంట మంచిగ వస్తది. దిగుబడి ఎక్కువస్తది. జపాన్ నాటు ఉండే. అది నడిచింది ఇన్ని రోజులు. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో, మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కలుపు మందులు వచ్చినయ్. ఆ కలుపు మందుల మాయాజాలం చమత్కారం. అవి కరెక్ట్ కొడితే గడ్డి మొలక కూడా మొల్వదు. ఇప్పుడు డైరెక్ట్ వడ్లు చల్లొచ్చు. అద్భుతమైన పంట పండుతుంది. ఇది నేను వట్టిగ చెప్పట్లేదు. నా ఎవుసంలో చేసి చూసిన. నాటుకు, కలుపులు ఇవన్నీ ఖర్చులు. వెదజల్లే పద్ధతి తెస్తే ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల పెట్టుబడి తప్పుతుంది. పంట పదిరోజుల ముందే వస్తది. దిగుబడి ఎక్కువొస్తది. నా పొలంలో ఎకరానికి 42క్వింటాళ్లు పండింది. నాటేసిన దానికంటే వెదజల్లితేనే పంట గట్టికొచ్చింది. 60ఎకరాల కు ఎలగట్లనే అలుకుడు జేసిన. నీళ్లు కట్టినం. కలుపు మందు కొట్టినం. వెదజల్లే పద్ధతిలో సిద్దిపేటనే లీడరు కావాలని కోరుతున్న.’
పత్తితో చాలా లాభమున్నది. ఎంతసేపు వరినే కాదు. గుజరాత్లో పత్తి పండుతుంది. గుజరాత్ స్పిన్నింగ్ మిల్లు వాళ్లు తెలంగాణ పత్తిని ఎగబడి కొనుగోలు చేస్తరు. తమిళనాడులోని తిరువూరులో పెద్ద టెక్స్టైల్ హబ్ ఉన్నది. వాళ్లు తమిళనాడు పత్తి కొనరు. మన తెలంగాణ పత్తిని పోటీపడి కొంటరు. మన భూమిలో పండే పత్తి చాలా బాగుంటుంది. పత్తి దారంతీస్తే ఎక్కువ పొడవు వస్తది. అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది. రాశి సీడ్స్ వారు సెంథిల్, సెల్వరాజ్ అనే వారు నాతో పత్తి గురించి మాట్లాడిన్రు. ప్రపంచంలో పండించే రెండు, మూడురకాల పత్తిలో తెలంగాణలో పండించే పత్తి మేలైన పత్తి అని, నీళ్లు కట్టి సరిగా చూస్తే ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు పత్తి పండుతుందని వారికి చెప్పిన. దీనికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ఉన్నది. ఎంత పత్తి పండి నా మంచి డిమాండ్ ఉంటుంది.. ఎక్కువ పండిస్తే లాభం జరుగుతుందని చెప్పిన. దానికి జిన్నింగ్ మిల్లులు అవసరమని చెప్పగానే, వారితో మాట్లాడి తెలంగాణలో ఉన్న 50 జిన్నింగ్ మిల్లుల సంఖ్యను 400కు తీసుకొచ్చినం. ఎవరు కొనకున్నా తాము కొంటామని వారు చెప్పిన్రు. కనీస మద్దతు ధరకు రూ.100 ఎక్కువిచ్చి కొంటమన్నరు. కాబట్టి రైతులు పత్తి ఎక్కువగా పండించాలి. అవకాశం ఉన్న రైతులు నీళ్లు కట్టి కూడా పండిస్తే మంచి లాభాలు ఉంటయి.
దేశంలో ఏ ప్రభుత్వం గ్రామ గ్రామానికి వెళ్లి ఒక కిలో ధాన్యం కూడా కొనలేదు. తెలంగాణలో 90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం, దాన్నికూడా కొందరు రాజకీయంచేయాలని చూస్తే రైతులు తన్ని తరిమి కొట్టాలి. కొనుగోలు కేంద్రాల వద్ద ఎంతోమంది హమాలీలకు, ట్రాక్టర్లకు, రైస్మిల్లు వాళ్లకు ఉపాధి దొరికింది. రైసుమిల్లులు సామర్థ్యం అంతగాలేదు. ఔత్సాహికులు రైసు మిల్లులు పెట్టుకోవాలి. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలి, అలాంటప్పుడే మంచి పాజిటివ్ దృక్పథం ఏర్పడి మంచి జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు బాగున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత చైతన్యజ్యోతి అనే కార్యక్రమాన్ని చేశాం. అయినా అసమానతలు తగ్గలేదని దళితుల అభ్యున్నతి కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాం. అందరికీ అవకాశాలు వచ్చి, అందరికీ ప్రాతినిధ్యం రావాలి. ఎవ్వరు ఏమనుకున్న నేను బతికున్నంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తూనే ఉంటా. నేడు రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. మనం పెట్టిన పథకాలు ఎవరొచ్చినా తీసేయనటువంటివి. ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయే పనులే చేస్తున్నం. మన ఊరిని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని, మన జిల్లాను ఎప్పటికైనా మనమే బాగుచేసుకోవాలి. ఎవరో వచ్చి చేయరు. పట్టుబట్టి పనులుచేస్తే ఫలితాలు అవేవస్తాయి, మాటలు మాట్లాడితే పనులుకావు. వరిపంట మాత్ర మే కాకుండా కంది, పత్తి, ఆయిల్ పామ్ పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలి. నేను పుట్టినగడ్డ సిద్దిపేట జిల్లా ఆదర్శ జిల్లాగా మారాలని ఆకాంక్షిస్తూ కలెక్టరేట్, జిల్లా అధికారులకు సిబ్బందికి అభినందనలు.