అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేశుడి సేవకు వేళైంది. రాష్ట్రంలోనే పేరొందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. 18న స్వామి అలంకారోత్సవం, 19న ఉద్దాలోత్సవం ప్రధాన ఘట్టాలు కాగా.. మరో నెలరోజుల పాటు జాతర కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలోనే తొలి, పెద్ద తిరునాళ్లకు భక్తులు లక్షలాదిగా తరలిరానుండగా.. ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నలుమూలల నుంచి బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.
మూసాపేట(చిన్నచింతకుంట) నవంబర్ 13 : పేదల తిరుపతి.. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్న కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. స్వామి వారి జాతర, ఉద్దాలోత్సవం ఉంటేనే దేశంలో ఎక్కడ ఉన్నా స్వామి వారి ఉద్దాల ఉత్సవాలకు తప్పనిసరిగా వస్తారు. ఉద్దాలోత్సవానికి భక్తులు కుటుంబ సమేతంగా బండ్లు, వాహనాలపై లక్షల్లో తరలివస్తారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని కొలిచి, రాత్రి మొత్తం అక్కడే ఉండి స్వామి సన్నీధిలో నిద్ర చేస్తారు. ఈ సంవత్సరం ఒక వైపు ఎన్నికలు, మరో వైపు జాతర ఉండడంతో భక్తుల సందర్శన అధికంగా ఉండనున్నది. ఉత్సవాలకు పాలకవర్గ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన 14వ తేదీన స్వామి వారి కల్యానోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన స్వామి వారి అలంకరణోత్సవం, 19న స్వామి ఉద్దాల ఉత్సవం ఉంటుంది.
ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవిని ఆడంబరంగా వివాహం చేసుకునేందుకు వేంకటేశ్వరస్వామి కుబేరుడితో అప్పు తీసుకుంటాడు. తీసుకున్న అప్పును తీర్చడంలో స్వామి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చెప్పిన కాలం గడిచిపోతుండడంతో కుబేరుడు అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో కలత చెందిన స్వామివారు ఓ రోజు అర్ధరాత్రి తిరుమలను వదిలి ఉత్తర దిశగా పయనమై నడుచుకుంటూ వస్తారు. జూరాల వద్ద గుండాల జలపాతం వద్ద నిండుగా ప్రవహిస్తున్న నదిని చూసి పరవశించిన స్వామివారు స్నానమాచరిస్తారు. అప్పటి వరకు తెల్లగా ప్రవహిస్తున్న నదిలో నీరు స్వామి వారి స్పర్శతో నీలం రంగులోకి మారుపోతుంది. ఆ రంగును చూసిన స్వామి వారు కృష్ణా అంటూ నదిని సంభోదిస్తారు. ఆయన పిలుపుతో కృష్ణమ్మ ప్రత్యక్షమై కాలినడకతో వస్తున్న స్వామివారు పాదాలు కందిపోకుండా పాదుకలను బహూకరిస్తుంది. అందుకే కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఉద్దాల ఉత్సవంగా నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరిన స్వామివారు నిర్మానుష్యంగా, నిర్మలమైన ప్రశాంతంగా ఉన్న కురుమూర్తి కొండల్లో ఉన్న కాంచన గుహలో సేదతీరేందుకు నిలిచిపోతాడు. స్వామి వారు లేరన్న బెంగతో పద్మావతిదేవి జాడ వెతుక్కుంటూ కురుమూర్తి కొండలకు చేరుకుంటుంది. స్వామి వారిని తన వెంట తిరుమలకు రావాలని ప్రాదేయపడడంతో కాదనలేక, తనకు ఇష్టమైన కురుమూర్తి కొండలను వదిలి వెళ్లలేక తన ప్రతిరూపంతోపాటు, పద్మావతిదేవి ప్రతి రూపాలను ఆ కాంచన గుహలోనే వదిలి వెళ్తారు. అప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తులకు స్వామివారు దర్శనమిస్తూ వారి కోరికలను తీర్చడం ద్వారా భక్తులు ఇష్టంగా ఇచ్చే కానుకలతో కుబేరుడి అప్పు తీరుస్తున్నట్లు భక్తుల నమ్మకం.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. ఉద్దాల ఊరేగింపులో భాగంగా మొదట పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా వడ్డ్డేమాన్ వరకు తీసుకొస్తారు. అక్కడే నియమ నిష్టలతో తయారు చేసిన స్వామి వారి పాదుకలు(ఉద్దాల)ను ఊరేగింపు ఉంటుంది. అందుకు భారీ బందోబస్తు ఆలయం వరకు కొనసాగుతుంది. ఉద్దాల ఉత్సవానికి ప్రజాప్రతినిధులతోపాటు లక్షల్లో భక్తులు తరలివస్తారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్, ఉన్నతాధికారులతో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సూచన మేరకు అధికారులు, పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీ ఉదయం 8గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అవాహితదేవాతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, భైరీపూజ, ఉత్సవాంగ 108 అష్టోత్తర శతకలశాభిషేకం, స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి మయూర వాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి.
15న ప్రత్యేక పూజలతోపాటు హంసవాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి.
16న ఉదయం 8గంటల నుంచే పూజా కార్యక్రమాల తోపాటు శేషవాహన సేవ.
17న ప్రత్యేక పూజలు, గజ వాహన సేవ కార్య్రమాలు.
18న స్వామి వారికి స్వర్ణభరణములతో అలంకార ఉత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ కార్య్రమాలు ఉంటాయి.
ఉత్సవాల్లో అసలైన ఘట్టం 19వ తేదీన ఉద్దాల ఉత్సవము, హనుమద్వాహన సేవ, గరరుడ వాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి.
20న ఉదయం 8గంటల ఆవాహిత దేవతాపూజలు, హోమాదులు, శ్రీపుష్పయాగము, శాత్తుమురై తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి.
21న ఉదయం 9గంటలకు అవబృదము శాత్తుమురై, మంగళ నీరాజనముతో ప్రత్యేక పూజలు.
29న ఉదయం 9:45గంటలకు స్వామి వారి అలంకారము తీయబడుతుందని పాలకవర్గం
సభ్యులు తెలిపారు.
ఉమ్మడి జిల్లా నుంచి బస్సు సౌకర్యం..
కురుమూర్తి స్వామి బ్రహోత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆర్టసీ అధికారులు జిల్లా నలుమూల నుంచి కురుమూర్తి స్వామి సన్నిధికి బస్సు సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, గద్వాల, నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, వనపర్తి, మరికల్, మక్తల్తోపాటు హైదరాబాద్ నుంచి కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతరలో తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు, భక్తులు స్వామి వారికి సమర్పించే మొక్కుబడులు చెల్లించడం కోసం ప్రత్యేక హుండీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు వస్తు రూపంలో ఇచ్చే కానుకలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఆలయం పరిసరాల్లో మత్తు పదార్థాలు అమ్మడం, జూదం ఆడడం నిషేధించినట్లు తెలిపారు.