వారం రోజులుగా గాంధీకి వచ్చే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ కేసులు తగ్గాయనుకుంటే బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. అయినా రోగుల ప్రాణాలు కాపాడుతున్నాం.
కేసులు బ్యాడ్ అయితే(మరణిస్తే) చాలా బాధపడేవాళ్లం. ఆ పూట నోట్లోకి అన్నం పోయేది కాదు. కానీ విధి నిర్వహణ తప్పదు. మార్చి నుంచి ఏప్రిల్ చివరిదాకా క్లిష్ట పరిస్థితి. వచ్చిన వారందరినీ బతికించే ప్రయత్నం చేస్తున్నాం.
కరోనా మొదటి దశ ప్రారంభం నుంచి పనిచేస్తున్నా. ఉదయం 9 గంటలకొస్తే ఇంటికెళ్లే సరికి తెల్లారవుతుంది. ఎంత అలసినా ఏడాది నుంచి ఇప్పటివరకు ఒక్క సెలవూ తీసుకోలేదు. ప్రతి రోగిని పేరుతో పిలుస్తా. అదే వారికి ఎంతో ధైర్యం. ‘కరోనా మొదటిదశ, రెండోదశకు చాలా తేడా ఉంది. రెండోదశలో అధికమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రత పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో మేలు జరిగింది. జన సమూహం లేకపోవడంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కేసుల సంఖ్య బాగా తగ్గాయి. గాంధీ దవాఖానలో అన్ని రకాల స్ట్రెయిన్లకు చికిత్స చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ప్రతి రోగిని చేర్చుకొని చికిత్స అందిస్తున్నాం. ప్రైవేటు దవాఖానల్లో రూ.లక్షలు పోసి నయంగాక చివరలో గాంధీకి వస్తున్న వారే అధికం. అయినా నిపుణులైన వైద్యులు, సిబ్బంది సాయంతో నయం చేసి ఇంటికి పంపుతున్నాం. కోలుకున్న రోగులు, వారి కుటుంబసభ్యుల ఆనందమే కొండంత బలం. వారి ఆశీర్వాదాలే మాకు కొత్త శక్తి’ అన్నారు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. కరోనా సేవలు, చికిత్స విధానం, ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక కథనం..
రోగుల దీవెనలే మాకు శ్రీరామరక్ష.. అవే మాకు యాంటిబాడీస్లా పనిచేస్తున్నాయి’ అని గాంధీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అంటున్నారు. ఇంత తీవ్రమైన వైరస్ మధ్యలో పూర్తి ఆరోగ్యంతో ఉన్నామంటే.. అది ముమ్మాటికీ వైద్యసేవల ఫలితమేనన్నారు. చికిత్స అందించి.. రోగుల ప్రాణాలు కాపాడటం కంటే పెద్ద బాధ్యత మరేదీ లేదంటున్న ఆయన.. పేషెంట్ను పేరుతో ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెబితేనే వారిలో మానసికైస్థెర్యం పెరిగి సగం జబ్బు పోతుందన్నారు. గాంధీలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేస్తూ.. 2020 మార్చి 22 నుంచి నేటి వరకు కరోనా రోగులకు నేరుగా ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్ రాజారావు. కొవిడ్పై ఎలాంటి స్పష్టత లేని, భయానకమైన తొలిదశలో పూర్తి ఆత్మవిశ్వాసం, ధైర్యంతో వేలాదిమందికి పునర్జన్మ ప్రసాదించారు. ప్రజల హృదయాల్లో ప్రత్యక్ష దైవంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తేతెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడిన రాజారావు.. కరోనా కష్టకాలంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు, చికిత్స విధానంలో అవలంబిస్తున్న మెలకువలపై మనోభావాలను పంచుకున్నారు. లాక్డౌన్తో ముప్పు తప్పిందని చెబుతున్నారు. ఇంకా ఏమన్నారంటే..
గతంలో ప్రభుత్వ వైద్యశాలల్లో బాగా చూడటం లేదని లేదా సరైన మందులు లేవనో ప్రైవేటుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటులో సరిగ్గా చూడటం లేదని గాంధీకి వస్తున్నారు. సెకండ్వేవ్లో అత్యవసర కేసులే తీసుకుంటున్నాం. దీంతో ప్రస్తుతం గాంధీకి వస్తున్నవారంతా ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమున్న పేషెంట్లే. ప్రైవేటు వైద్యశాలల్లో లక్షలు పెట్టి.. చికిత్స పొంది.. ఆయా ఆస్పత్రులు చేతులెత్తేయడంతో చివరి దశలో గాంధీకి తీసుకొస్తున్నారు. 80 శాతానికి పైగా అలాంటి కేసులే వస్తున్నాయి. వాటిని సవాల్గా తీసుకొని చికిత్స చేస్తున్నాం. రోగి కోలుకున్నప్పడు వారి కుటుంబసభ్యుల్లో కనిపించే ఆనందం చూస్తే.. మా వైద్యులకు కొండంత బలం వస్తుంది. మరింత బాధ్యతనూ పెంచుతుంది.
రోగులకు చికిత్స అందించి ప్రాణాలు కాపాడటం కంటే పెద్ద బాధ్యత మరొకటి లేదు. ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపు నేను హాస్పిటల్కి వస్తా. ముందుగా రౌండ్స్కి వెళ్తాను. ప్రతి వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడుతాను. దాదాపుగా ప్రతి రోగిని పేరుతో పలకరిస్తా. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన ట్రీట్మెంట్ను కేస్షీట్లో రాసి అక్కడున్న డాక్టర్స్కి చెబుతాను. రోగులందరినీ చూసిన తర్వాతే చాంబర్లోకి వెళ్తాను.
రోజుకు 200పైనే అత్యవసర కేసులకు సంబంధించి అడ్మిషన్లు అయ్యేవి. వచ్చిన వారిని వెనక్కి తిప్పి పంపకుండా సర్దుబాటు చేసేవాళ్లం. వారం రోజులుగా కొంత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఊపిరి తీసుకుందామనుకునే లోపే బ్లాక్ఫంగస్ వచ్చిపడింది. కొవిడ్ కేసులు తగ్గుతుంటే.. ఇవి పెరుగుతున్నాయి. అయినప్పటికీ మాకు రోగుల ప్రాణాలు కాపాడడమే ముఖ్యం. రోగులకు ఈ పరిస్థితి వచ్చినందుకు ఒకవైపు బాధపడుతూనే.. వారికి సేవ చేసే అవకాశం రావడం బాధ్యతగా.. మానవ సేవగా భావిస్తున్నాం.
గాంధీకి వచ్చే కేసులన్నీ క్రిటికల్వే. ప్రతి రోజూ ఇక్కడ 1200 నుంచి 1300 వరకు ఐపీ కేసులు ఉండేవి. వెంటిలేటర్ బెడ్స్ ఇప్పటికీ ఖాళీ లేవు. అన్ని విభాగాల వైద్యులను సమన్వయపరిచి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశాం. షిఫ్టుల వారీగా బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ప్రతి వైద్య బృందం కూడా వారి సమయానికి మించి పనిచేస్తున్నాయి. వారికి నా హాట్సాఫ్. ఇక నేను ఉదయం వస్తే..ఇంటికి వెళ్లేసరికి తెల్లారేది. ఇప్పుడు కాస్త కేసులు తగ్గుముఖం పట్టడంతో కొంత రిలీఫ్గా ఉంది. ఎవరైనా మరణిస్తే చాలా బాధపడేవాళ్లం.. ఆ పూట నోట్లో అన్నం కూడా పోయేది కాదు. మార్చి నుంచి ఏప్రిల్ చివరి వరకు చాలా క్లిష్ట పరిస్థితులు ఉండేవి. రోగులకు పడకల సర్దుబాటు చేయడం ఒక ఎత్తయితే వారికి చికిత్స అందించడం మరో ఎత్తు. ఎందుకంటే దాదాపు కేసులన్నీ ఆఖరు క్షణాల్లో వచ్చినవే కావడం. దేవుడి మీద భారం వేసి.. పేషెంట్ను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నించేవాళ్లం. ఇక్కడికి వచ్చిన అత్యవసర కేసుల్లో 95 శాతం మందిని కాపాడగలిగాం.
రోగుల దీవెనలే మాకు యాంటిబాడీస్గా పనిచేస్తున్నాయనుకుంటున్నా. ఎందుకంటే బయట పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అసలు నేనైతే 2021ను చూస్తానో లేదో అని ఒక దశలో ఆందోళన చెందా. కానీ రోగులు, వారి కుటుంబసభ్యుల ఆశీర్వచనాలు నాకు అండగా ఉన్నట్లు భావిస్తున్నా. రెండేండ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. రోగులకు సేవ చేయడం కోసమే.. ఆ దేవుడు నాకు శక్తి ప్రసాదిస్తున్నాడేమో. పేషెంట్స్కి చేస్తున్న సేవలే మా వైద్యులకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని భావిస్తున్నా.
దేశంలో దాదాపు అన్ని రాష్ర్టాల రోగులు గాంధీలో ఉన్నారు. సెకండ్వేవ్ ప్రారంభంలో మహారాష్ట్ర నుంచి కనీసం వంద కేసులు వచ్చాయి. తరువాత కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ ఇలా చాలా రాష్ర్టాల నుంచి చికిత్స కోసం వచ్చారు. ఒక్కో ప్రాంతంలో వైరస్ ఒక్కో రకమైన స్ట్రెయిన్తో విజృంభించింది. వైజాగ్ స్ట్రెయిన్కు సంబంధించి 40 కేసులు, కర్నూలు స్ట్రెయిన్కు సంబంధించి 50 కేసులు, మహారాష్ట్ర స్ట్రెయిన్కు సంబంధించి 100 కేసులు ఇలా వివిధ రకాల స్ట్రెయిన్లతో గాంధీకి రావడంతో ఒక దశలో పరిస్థితి విషమంగా మారింది.