హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘ఓ మహానుభావుడు (2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రకటనను గుర్తుచేస్తూ..) చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని ఓటు వేసేందుకు బయలుదేరే ముందు మా ఇంట్లో సిలిండర్కు దండం పెట్టుకొని వచ్చాను’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్లోని షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఆయన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఇటీవలి కాలంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరగటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చెప్పకనే చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగల, సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు వేశానని, వచ్చేముందు ఇంట్లో సిలిండర్కు దండం పెట్టుకున్నట్టు చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 39 శాతమే పోలింగ్ జరిగిందని, ఈసారి ఓటర్లంతా ఓటు వేసి పోలింగ్ శాతం పెంచాలని కోరారు. విద్యావంతులు ఓటింగ్కు దూరంగా ఉంటారనే అపప్రథను దూరంచేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు.