సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ నేత మృతి.. కుటుంబానికి మంత్రి పరామర్శ
సిరిసిల్ల, జూలై 26: టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిరిసిల్ల నియోజకవర్గ యువ నాయకుడు దినేశ్రెడ్డి కరెంట్ షాక్తో చనిపోయారు. ఆయన కుటుంబాన్ని సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పరామర్శించారు. ఈ సందర్భంగా తన మీద అభిమానంతో దినేశ్ రెడ్డి.. ఆయన కుమారుడికి తారకరామ్రెడ్డి అన్న పేరు పెట్టినట్టు తెలుసుకొని..‘నా పేరు పెట్టుకున్నా వట. ఇక్కడికి రా చిన్నా’ అని ఆ బాలుడిని ఆప్యాయంగా ఎత్తుకు న్నారు. ట్విట్టర్లో స్పందించిన మంత్రి.. ‘దినేశ్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించా. ఆయన తన కుమారుడికి తారకరామ్రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అది నా మనసుకు తాకింది. నా పేరు పెట్టుకున్న ఆ బాలుడికి అంతా మంచే జరగాలి. ఆ కుటుంబానికి అండగా ఉంటా’ అని పేర్కొన్నారు.
క్షతగాత్రులకు కేటీఆర్ సహాయం
సిద్దిపేట బైపాస్పై జరిగిన బైక్ యాక్సిడెంట్లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో సిరిసిల్ల పర్యటనను ముగించుకొని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వస్తున్నారు. క్షతగాత్రులను చూసిన మంత్రి వెంటనే తన కాన్వాయ్లోని రెండు కార్లలో వారిని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తోడుగా తన పీఏ మహేందర్రెడ్డి, ఎస్కార్ట్ పోలీసులను కూడా పంపించారు.