హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని పునరుద్ధరించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీసీఐకి అన్ని రకాల వనరులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు లేఖ రాశారు. సీసీఐ పునరుద్ధరణ అంశాన్ని గతంలో కూడా పలుమార్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఆదిలాబాద్లో 1984లో సుమారు రూ.47 కోట్ల వ్యయంతో సీసీఐని ఏర్పాటుచేశారని తెలిపారు. 772 ఎకరాల్లో ప్లాంట్ ఉన్నదని, అనుబంధంగా 170 ఎకరాల్లో సీసీఐ టౌన్షిప్ కూడా ఏర్పాటయిందని పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రత్యేకంగా 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ డిపాజిట్ల మైనింగ్ లీజు ఉన్నదని తెలిపారు. 32 కేవీ విద్యుత్తు సరఫరా కనెక్షన్, నీటి లభ్యత కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ ప్లాంట్ ఉత్తర తెలంగాణతోపాటు మహారాష్ట్రలోని మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల అవసరాలు తీర్చిందని.. దురదృష్టవశాత్తు నిధుల లేమితో 1996లో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయని తెలిపారు. 2008లో సీసీఐ ఉద్యోగులకు స్వ చ్ఛంద పదవీ విరమణ ప్రకటించి, సంస్థను పూర్తిగా మూసివేశారని పేర్కొన్నారు. కొం దరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా, స్టేటస్ కో ఇచ్చిందని, దీంతో ఇప్పటికీ సుమారు 75 మంది కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉన్నారని తెలిపారు. కంపెనీ కార్యకలాపాల పునరుద్ధరణకు అన్నిరకాల సహాయ సహకారా లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇ చ్చారు. బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.
పరిశ్రమలశాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పారిశ్రామికపారుల అభివృద్ధిపై సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన పారిశ్రామికపారుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధంచేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి పనిచేయాలని సూచించారు. పరిశ్రమలను ఔటర్ వెలుపలకు తరలించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరలింపును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులువస్తున్న నేపథ్యంలో నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలశాఖలోఉన్న వివిధ విభాగాలవారీగా ఆయా డైరెక్టర్లతో రాష్ట్రానికి రానున్న పెట్టుబడి ప్రతిపాదనలు, వాటి పురోగతిపై చర్చించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పరిశ్రమలశాఖ కమిషనర్ మాణిక్రాజ్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికులకే కల్పించాలని మంత్రి కేటీఆర్ వాటి యాజమాన్యాలను కోరారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ గురువారం నియోజకవర్గం పరిధిలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానికులకు ఎకువ ఉపాధి అవకాశాలను కల్పించే కంపెనీలకు నూతన పారిశ్రామికపాలసీ కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు వంటివి అందిస్తామని.. ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సిమెంట్ పరిశ్రమల అవసరాలపై దృష్టి సారించి, స్థానిక యువతకు సాంకేతికరంగంలో రాణించడానికి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే అంశంలో పరిశ్రమల యజమాన్యానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అప్రెంటిస్షిప్ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని కోరారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.