లండన్: ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ఏడోసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. శుక్రవారం సెంటర్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/3), 7-5, 7-5తో పదో సీడ్ డేనిస్ షపలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. 2 గంటల 44 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 7 ఏస్లు సంధించిన జొకో.. 32 విన్నర్లు బాదగా.. 36 అనవసర తప్పిదాలు చేసిన షపలోవ్ మూల్యం చెల్లించుకున్నాడు.
మరో సెమీస్లో ఏడో సీడ్ బెర్టిని (ఇటలీ) 6-3, 6-0, 6-7 (3/7), 6-4తో అన్సీడెడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. దీంతో 45 ఏండ్ల తర్వాత పురుషుల విభాగంలో గ్రాండ్స్లామ్ టైటిల్ పోరుకు చేరిన తొలి ఇటలీ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. రెండు గంటల 37 నిమిషాల పాటు సాగిన పోరులో 22 ఏస్లు బాదిన బెర్టిని 60 విన్నర్లు సంధించగా.. 5 ఏస్లు కొట్టిన హుర్కాజ్ 27 విన్నర్లకే పరిమితమయ్యాడు. మైదానంలోని ప్రేక్షకులంతా ఇటాలియన్ భాషలో తనను ఉత్సహ పరచడాన్ని ఎప్పటికీ మరువలేనన్న బెర్టిని.. తన జీవితంలో ఈ క్షణాలను మరిచిపోలేనని భావోద్వేగానికి గురయ్యాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో శనివారం ప్రపంచ నంబర్వన్, ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ.. కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో తలపడనుంది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన బార్టీ.. రెండో గ్రాండ్స్లామ్ టైటిల్పై కన్నేయగా.. ప్లిస్కోవా తొలి టైటిల్ కోసం తహతహలాడుతున్నది.