శ్రీకృష్ణావతారం సంపూర్ణమైంది. ద్వారక లీలల్లో భాగంగా 16,108 మంది గోపికలను శ్రీకృష్ణుడు వివాహమాడాడు. శ్రీకృష్ణుని వివాహం గురించి విన్న యశోదమ్మ తానూ ప్రత్యక్షంగా ‘శ్రీకృష్ణుని కల్యాణాన్ని’ వీక్షించాలని కోరుకుంది. దీంతో తదుపరి జన్మలో యశోదమ్మ వకుళాదేవియై జన్మించగా, శ్రీకృష్ణుడు శ్రీనివాసుడై ఆమె తనయునిగా అవతరించాడు. అదే సమయంలో, వేదవతి పద్మావతిగా నారాయణపుర రాజ్యాన్ని పాలించే ఆకాశరాజు- ధరణీదేవి ముద్దుల పుత్రికగా ఆవిర్భవించింది. కల్యాణ వయసుకు రాగానే వారు ఆమెకు తగిన వరుని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఒకానొకరోజు పద్మావతీదేవి తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నది. ఇంతలో, శ్రీనివాసుడు వన్యమృగాలను వేటాడుతూ అదే అడవిలోకి వచ్చాడు. తాను వేటాడుతున్న ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ పద్మావతీదేవి ఉన్న ఉద్యానవనంలోకి ప్రవేశించింది. అదే శ్రీనివాసుడు, పద్మావతీ దేవి మొట్టమొదటిసారిగా ఒకరినొకరు కలుసుకొన్న శుభవేళ. విడదీయలేని ఆ దివ్యానుబంధం వారిరువురి హృదయాల్లో సహజమైన ప్రేమానురాగాలను చిగురింపజేసింది.
శ్రీనివాసుడు ‘ఆమెను పరిణయ మాడాలని’ తలచాడు. అయితే, పద్మావతీదేవి చుట్టూ ఉన్న చెలికత్తెల కారణంగా ఇంటికి వెనుదిరిగాడు. శ్రీనివాసుడు తన మదిలోని కోరికను తల్లి వకుళాదేవికి చెప్పాడు. శ్రీనివాసుడు తల్లికి తన ‘శ్రీకృష్ణుని రూపాన్ని’ చూపి, యశోదగా వకుళాదేవికి తన గతజన్మ వృత్తాంతం వివరించాడు. పద్మావతీదేవి తన స్వామిని విడిచి ఉండటం ఏ మాత్రం భరించలేకపోయింది. నిత్యం ఆయననే స్మరిస్తూ నిద్రాహారాలను కూడా మరచింది. ఆమె తల్లిదండ్రులు అందుకు గల కారణాన్ని తెలుసుకోలేకపోయారు. ఇంతలో, శ్రీనివాసుడు తన తల్లి వకుళాదేవిని ‘పెండ్లి సంబంధం మాట్లాడి రమ్మని’ రాజువద్దకు పంపించాడు. అంతకన్నా ముందు, తానే ఒక జ్యోతిషురాలి రూపంలో ఆ రాజభవనానికి వెళ్లాడు. జరగబోయే పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం గురించి రాజదంపతులకు ఆమె జోస్యంగా చెప్పింది. తమ కూతురు పద్మావతీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అని, ఆమెను మనువాడేందుకు సాక్షాత్తు విష్ణుమూర్తియే ‘శ్రీనివాసుని’గా అవతరించాడని కూడా తెలిపింది. అతి త్వరలోనే తమను కలిసేందుకు వకుళాదేవి రానున్నదనీ తెలియజేసింది.
జ్యోతిషురాలు చెప్పినట్టే వకుళాదేవి రాజభవనానికి వెళ్లగా సకల రాచమర్యాదలతో ఆమెకు స్వాగతం లభించింది. ‘పద్మావతీ దేవిని పరిణయమాడాలనే శ్రీనివాసుని అభీష్టాన్ని’ ఆ రాజదంపతులకు తెలియజేసింది. ‘ఆ శ్రీనివాసుడే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని’ చెప్పింది. ఆకాశరాజు, ధరణీ దంపతులు సలహా కోసం శుకమహర్షిని ఆశ్రయించారు. ‘శ్రీనివాసుడు సాక్షాత్తు వైకుంఠనాథుడేనని, వెంటనే పద్మావతినిచ్చి కల్యాణం జరిపించమని’ ఆ రాజదంపతులకు ఆయన మార్గనిర్దేశనం చేశాడు. కూతురికి తగిన వరుడు దొరికినందుకు ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు. ఆకాశరాజు తన పుత్రికను కన్యాదానంగా స్వీకరించవలసిందిగా శ్రీనివాసునికి లిఖిత పూర్వకంగా సందేశం పంపాడు. శ్రీవారి కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలు కదలి వచ్చారు. శ్రీనివాసుడు తన కల్యాణోత్సవానికయ్యే ఖర్చుకోసం కుబేరునివద్ద ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు. కలియుగం ముగిసేలోపు వడ్డీతోసహా అప్పు చెల్లించాలన్నది వారిరువురిమధ్య కుదిరిన ఒప్పందం!
కొల్హాపూర్లో కొలువైన లక్ష్మీదేవి సైతం వేడుకలో పాల్గొనేందుకు వచ్చింది. పెండ్లికి ముందు స్వామికి ‘అవభృత స్నానం’ చేయించడంలో తోడ్పడింది. ఆపై అద్భుత వస్ర్తాభరణాలతో స్వామిని అలంకరించారు. స్వామి ముగ్ధమనోహర సౌందర్యం ముందు వెయ్యిమంది మన్మథులైనా సరిపోరు. ఎటు చూసినా ఆకాశాన్నంటే మంగళ తోరణాలతో నారాయణపురమంతా శోభిల్లింది. తల్లి ధరణీదేవి పెండ్లికూతురు పద్మావతీదేవిని వివాహవేదికపైకి తీసుకురాగా సమస్త దేవతలూ, ఋషులు, భక్తుల సమక్షంలో వధూవరులిరువురూ ఒకరినొకరు పుష్పమాలలతో అలంకరించుకున్నారు. వివాహ వేడుకలు 11 రోజులపాటు జరిగాయి. అనంతరం పద్మావతీ శ్రీనివాసులు అగస్త్యముని ఆశ్రమంలో నివసించారు. సకల శుభప్రదమైన పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం విన్నవారికి, గాంచినవారికి సమస్తశుభాలు సంప్రాప్తిస్తాయి. ఏడుకొండలవాడా వేంకటరమణ! గోవిందా గోవింద!
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి,
93969 56984