హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నేతన్నలకు భరోసాగా నిలిచిన పొదుపు పథకం ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు పరిశ్రమలు, టెక్స్టైల్శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. చేనేత, మరమగ్గాల కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వాములు కావచ్చన్నారు. సోమవారం ప్రగతిభవన్లో టెక్స్టైల్శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగంగా కార్మికులు చేసే పొదుపు మొత్తాలకు ప్రభుత్వం తన వాటాను జోడించి వారి ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. చేనేత కార్మికులు పొదుపుచేసే 8 శాతం వేతన వాటాకు ప్రభుత్వం రెట్టింపుగా 16 శాతం, పవర్లూం కార్మికులకు 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో ఎనిమిది శాతాన్ని జోడిస్తుందని తెలిపారు. దీనిద్వారా 25 వేలమంది చేనేత కార్మికులు, పది వేలమంది పవర్లూం కార్మికులు కలిపి మొత్తం 35 వేల మంది జీవితాలకు భరోసా కలుగుతుందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలోచేనేత కార్మికులకు మాత్రమే వర్తింపచేసిన ఈ పథకాన్ని.. తెలంగాణ వచ్చాక మరమగ్గ కార్మికులకు కూడా వర్తింపచేస్తున్నామని తెలిపారు. గతంలో సొసైటీ పరిధిలో ఉన్న చేనేత కార్మికులు మాత్రమే పథకంలో లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం డయ్యర్స్, డిజైనర్స్, వీవర్స్, వైండర్స్ తదితర ఇతర పనివారికి కూడా వర్తింపజేస్తున్నట్టు వివరించారు. అర్హులైనవారు వెంటనే ఈ పథకంలో చేరవచ్చని సూచించారు.
కరోనా సమయంలో చేయూత
కరోనా సమయంలో నేతన్నకు చేయూత పథకం నేత కార్మికులకు ఎంతో అండగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణీత గడువుకన్నా ముందే వారు తమ మొత్తాలను పొందే వెసులుబాటు కల్పించామన్నారు. దీంతో నేతన్నలకు సుమారు రూ.109 కోట్ల ప్రయోజనం కలిగిందని తెలిపారు. ఇంతటి ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని నేతన్నలు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. అంతేకాకుండా ఈ పథకానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, నేతన్నలంతా ఈ పథకంలో చేరాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. సమావేశంలో టెక్స్టైల్శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణీత గడువుకన్నా ముందే చేనేత కార్మికులు తమ పొదుపు మొత్తాలను పొందే వెసులుబాటు కల్పించాం. దీంతో నేతన్నలకు సుమారు రూ.109 కోట్ల ప్రయోజనం కలిగింది. ఇంతటి ప్రయోజన కరంగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని నేతన్నలు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నది.