‘నమస్తే’ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందన
ట్విట్టర్లో చూసి రుషిక్ వైద్యానికి హామీ
నందిపేట్/మెట్పల్లి, మే 28: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రుషిక్ (4) అనే బాలుడి వైద్యానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ నిజామాబాద్ టాబ్లాయిడ్లో శుక్రవారం ప్రచురితమైన ‘పేద కుటుంబంపై పెను భారం’ అనే కథనం క్లిప్పింగ్ను ట్విట్టర్లో చూసిన మంత్రి.. రుషిక్కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంత్రి కార్యాలయం నుంచి రుషిక్ తండ్రి అర్గుల సాయికుమార్కు ఫోన్ చేసి వివరాలను తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కే)కు చెందిన రుషిక్.. బ్రెయిన్ ట్యూమర్తో హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల రుషిక్కు ఆపరేషన్ జరిగింది. రూ.14 లక్షల ఖర్చయింది. అప్పులు చేసి, భూమి, బంగారం అమ్మి రూ.14 లక్షలు పోగు చేసి ఆపరేషన్ చేయించినా వారికి ఫలితం దక్కలేదు. దవాఖాన నుంచి ఇంటికి వచ్చిన వారానికే ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మరోసారి ఆపరేషన్ చేయాలని, అందుకు మళ్లీ రూ.14 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి గోడుపై ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఈ క్లిప్పింగ్ను ఓ యువకుడు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు పోస్ట్ చేయడంతో గంటల వ్యవధిలోనే కేటీఆర్ స్పందించారు. రుషిక్ తండ్రితో మంత్రి పీఏ ఫోన్లో మాట్లాడారు. బాలుడి వైద్య రిపోర్టులు తీసుకొని కార్యాలయానికి రావాలన్నారు. దీంతో కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ‘నమస్తే తెలంగాణ’కు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కూడా బాలుడి వైద్యానికి సహకారం అందిస్తానని హామీఇచ్చారు.
అత్యవసరంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించి ఓ రోగికి ఆక్సిజన్ అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పర్రె సాగర్ పది రోజుల కిందట కరోనాతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో రెండ్రోజుల్లో డిశ్చార్జి చేస్తామని, ఇంటివద్ద ఆక్సిజన్ కోసం కాన్సన్ట్రేటర్ అవసరమవుతుందని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని సాగర్ భార్య శ్వేత ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను శుక్రవారం వారి ఇంటికి పంపారు.