నల్లగొండ ప్రతినిధి, మార్చి30 (నమస్తే తెలంగాణ): త్రిపురారం, మాడ్గులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మంగళవారం నామినేషన్ దాఖలు అనంతరం సాయంత్రం మాడ్గులపల్లి మండలంలో ప్రచారాన్ని ప్రారంభించిన భగత్ రెండోరోజు కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటలకు త్రిపురారం మండలం కంపాసాగర్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, చిరుమర్తి లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ రాంచందర్నాయక్లతో పాటు స్థానిక నేతలతో కలిసి భగత్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రజలు పెద్ద ఎత్తున పూలుచల్లుతూ వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలు వేస్తూ… యువకులు డప్పుల నృత్యాలతో ప్రచార రథం ముందు నడిచారు. వందలాది మంది వెంట రాగా కంపాసాగర్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధి జానారెడ్డికి ఓటేస్తే ఉపయోగం ఉండదని ప్రజలకు పిలుపునిచ్చారు. అభ్యర్థ్ధి భగత్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన తండ్రిని ఆదరించారని, ఆయన మధ్యలోనే మనల్ని విడిచి వెళ్లారని… ఆయన స్థానంలో తనను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి జి.అన్నారం, దుగ్గేపల్లి, కంపాలపల్లి మీదుగా కామారెడ్డిగూడెం వరకు ప్రచారం కొనసాగింది. పలుచోట్ల మహిళలు హారతులు పట్టి.. నుదట తిలకం దిద్ది ఆశీర్వదించారు. కామారెడ్డిగూడెంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రచారంలో జత కలిశారు. గ్రామ కూడలిలో సభ జరగ్గా ప్రజలు పలు సమస్యలను మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి స్పందిస్తూ… నోముల నర్సింహయ్య నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధ్ది కోసం తపించారని, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలానికే కరోనాతో అన్ని పనులు బంద్ అయ్యాయని వివరించారు. కరోనా నుంచి బయట పడుతున్న వేళ అకస్మాత్తుగా నర్సింహయ్య అందర్నీ విడిచి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆయన స్థానంలో సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు భగత్నే మీ వద్దకు పంపించారు. ఆయన్ను గెలిపించుకుని మీ గ్రామంతో పాటు సాగర్ నియోజకవర్గంలోని అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం అని పిలుపునివ్వగా ప్రజలు చప్పట్లతో ఆమోదం తెలిపారు.
పింఛన్ ఇస్తున్న కారు గుర్తుకే ఓటేస్తాం
అక్కడి నుంచి నేరుగా ప్రచారరథం కొణతాలపల్లికి చేరుకుంది. ఎర్రటి ఎండలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రచార సభలో పాల్గొన్నారు. వృద్ధ్దులు ఎండను సైతం లెక్కచేయకుండా తమకు నెలనెలా పెన్షన్ ఇస్తున్న కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పారు. గ్రామ కూడలిలోని లక్ష్మమ్మ అనే 65 ఏండ్ల వృద్ధ్దురాలిని ఏం జరుగుతుంది ఇక్కడ పెద్దమ్మ అని పలకరిస్తే..కారు గుర్తోళ్లు వస్తుండ్రంట.. నాకు నెలనెలా పింఛనొస్తుంది. అప్పుడెవ్వరూ ఇవ్వలేదు.. కేసీఆర్ సారు వచ్చినాకనే ఇస్తుండు..అందుకే ఆళ్ల కోసం చూస్తున్నా. అంటూ విడమరిచి చెప్పింది. ఎవరి ఓటేస్తావంటే… ఇంకెవ్వలికి.. కేసీఆర్ సార్ కారు గుర్తుకే అంటూ బల్లగుద్దినట్లు చెప్పింది. మీ ముసలోళ్లు అంతా ఇట్లనే ఏస్తరా అంటే..అందరూ ఏస్తరు.. కారు గుర్తుకెయ్యకుంటే ఇంకోళకు ఏస్తం అంటూ పక్కన ఉన్న మరో ముసలామె వైపు చూస్తూ చెప్పింది. అదే విధంగా వెంకటయ్య అనే ఓ రైతును పలకరిస్తే కూడా మా ఊరిలో 300 ఎకరాలకు ప్రత్యేకంగా పైపులైన్ వేసి నీళ్లు ఇచ్చిండ్రు. అంతకుముందు ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. నర్సింహయ్య సారు ఎమ్మెల్యే అయ్యాకే వచ్చాయి. పంటలు పండుతున్నయ్. రైతుబంధు డబ్బులు వేస్తున్నరు..వడ్లు మొత్తం ఊర్లల్లకొచ్చే కొంటున్నరు. ఇంతకు ముందు ఎవ్వరూ ఇలాంటివి చేయ్యలే. అందుకే ఈ సారి కూడా రైతుల ఓట్లు టీఆర్ఎస్ కారు గుర్తుకే అని స్పష్టం చేశారు. ఇలా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది టీఆర్ఎస్తోనే మాకు లాభమంటూ కుండబద్దలు కొట్టారు.
భగత్ను గెలిపించి సాగర్ అభివృద్ధిని కొనసాగిద్దాం
సభలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డికి 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన ఏం చేయలేదనే 2018లో జనం ఓడించారని, అలాంటి వ్యక్తితో ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. అనంతరం అక్కడే ఉన్న వీర జవాన్ మిట్ట శ్రీనివాస్రెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రచారం మాడ్గులపల్లి మండలం గారకుంటపాలెంలోకి ప్రవేశించింది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ ప్రచారం మొదలైంది. మండల ఇన్చార్జి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి ప్రచారానికి సారథ్యం వహించగా అభ్యర్థి భగత్తో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంట నడిచారు. హాలియాలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి అక్కడి నుంచి నేరుగా కేశవాపురం చేరుకుని ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత మాచనపల్లి, గోపాలపురం, ధర్మాపురం, కన్నెకల్లు, గారకుంటపాలెం వరకు కొనసాగింది. రాత్రి 9.45 గంటల వరకు ప్రచారం అవిశ్రాంతంగా కొనసాగింది. సభల్లో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సాగర్లోని అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నా… 30 ఎండ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన జానారెడ్డి ఎనాడూ వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏనాడూ ఈ ప్రాంతంలోని సమస్యలపై సీఎం వద్దకు గానీ, ప్రభుత్వ అధికారుల వద్దకు గానీ వచ్చింది లేదని స్పష్టం చేశారు. అందుకే 2018లో ప్రజలు అభివృద్ధ్దిని కోరుకుంటూ జానారెడ్డిని తిరస్కరించారని, ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని హెచ్చరించారు. ఇలా అన్ని చోట్ల మంత్రి జగదీశ్రెడ్డితో పాటు అభ్యర్థి భగత్, ఇతర నేతల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ఇవి కూడా చుడండి
మహిపాల్రెడ్డి స్ఫూర్తిగా మరింత ఉత్సాహంగా పనిచేస్తాం
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు