హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాలు ఆగడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు పలుప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓల్డ్ కొత్తగూడెంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాచలంలో 6.5, పాల్వంచలోని సీతారామపట్నంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, నారాయణపేట, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడగా, విదర్బ పరిసరాల్లో 3.6 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కేరళ తీరం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకవరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితలద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా వైరాలో 38.8 డిగ్రీలు, జీహెచ్ఎంసీలోని నారాయణ గూడలో 36.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తడిసిన ధాన్యం
ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి మిర్చి, ధాన్యం నీటిపాలయ్యా యి. చర్ల మండలం వీరాపురంలోని ఇసుకపాయలో ఆరబెట్టిన మిర్చి వాననీటిలో తేలింది. బూర్గంపహాడ్లోని మార్కెట్యార్డులో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. పొలాల్లో ధాన్యం ముద్దయింది. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లవరంలో పిడుగుపాటుకు నారాయణపేటకు చెందిన గొర్రెల కాపరి నరసింహాయాదవ్ (45) మృతిచెందారు.