హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడోదశ వచ్చినా వైరస్పై పోరాడేందుకు అన్ని విధాలుగా సమాయత్తమై ఉన్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో కొవిడ్ కమాండ్ సెంటర్ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. శుక్రవారం కమాండ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. కొవిడ్-19కి సంబంధించిన డాటాను నిర్వహించటం ద్వారా పరిపాలన వ్యవస్థకు ఉపయుక్తంగా ఉండి పరిస్థితిని నియంత్రించడంలో ఈ సెంటర్ సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. విశ్వసనీయ వైద్యసేవల సలహా కేంద్రంగా ప్రజలకు సమాచారాన్ని అందిస్తుందన్నారు. కంట్రోల్ రూమ్లో కమాండ్ సెంటర్, కాల్ సెంటర్ , టెలిమెడిసిన్ ఉన్నాయి. ఇదే ప్రాంగణం లో ఏర్పాటుచేసిన కాల్సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. పౌరులు 1905 కు డయల్చేసి టీకా కేంద్రాలు, దవాఖానలో చేరటం వంటి అన్ని సేవలు పొందవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లు, కాల్ సెంటర్ను నిర్వహిస్తున్న సిబ్బందిని కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్కుమార్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఉన్నతా ధికారులు రిజ్వీ, రాహుల్ బొజ్జా, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ డైరెక్టర్ అలుగు వర్షిణి పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముందు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో..‘శాంతి కోసం ఎంత శ్రమిస్తే యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము’ అని ట్వీట్ చేశారు.