మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 27: ఆపదలో ఉన్న వారికి తానున్నానని భరోసా కల్పించే మంత్రి కేటీఆర్.. మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. మంచిర్యాలకు చెందిన టీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రవీందర్రెడ్డి పంపిన వాట్సాప్ సందేశానికి స్పందించిన మంత్రి.. కరోనా బారిన పడి ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులకు అవసరమైన రెమిడెసివర్ మందును అందుబాటులో ఉంచారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పొన్నం మల్లయ్య, యాదలక్ష్మి దంపతులకు కొడుకులు పొన్నం మురళి, పొన్నం మధు, కూతుళ్లు సునీత, సంధ్య. వీరంతా మూడేండ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి స్థిరపడ్డారు. కుమారులిద్దరూ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారు. మల్లయ్య, యాదలక్ష్మి వారంక్రితం కరోనా బారినపడ్డారు. లాలాగూడ రైల్వే దవాఖానలో చికిత్స పొందుతూ మల్లయ్య సోమవారం ఉదయం మృతిచెందాడు. యాదలక్ష్మి కరోనాతో ఏఎస్రావునగర్లోని న్యూలైఫ్లైన్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. కోడలు స్రవంతి కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఇద్దరు కొడుకులు మురళి, మధు కూడా కరోనా బారిన పడి కూకట్పల్లిలోని ఓ హాస్పిటల్’లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురికీ రెమిడెసివర్ మందు కావాలని వైద్యులు సూచించగా.. ఎక్కడా లభ్యంకాలేదు. వీరి పరిస్థితి తెలుసుకొన్న మంచిర్యాలకు చెందిన టీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రవీందర్రెడ్డి.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్కు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తిచేశారు. గంటన్నర తర్వాత మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో మాసాబ్ట్యాంక్ వద్ద ఉన్న మంత్రి కార్యాలయంలో కరోనా బాధితులకు కావాల్సిన మందులను సిబ్బంది అందించారు. అత్యంత క్లిష్ట సమయంలో మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.