సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్/ నిడమనూరు, మే 30: కరోనా ఆపత్కాలంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఔదార్యాన్ని చాటుతున్నారు. సోషల్మీడియా ద్వారా దృష్టికి వస్తున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తక్షణమే సాయం అందిస్తున్నారు. కష్టాల్లో బాధితులకు అండగా నిలుస్తున్నారు.
అడిగిన వెంటనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
ఇంట్లో చికిత్స కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావాలంటూ ఉమ్మడి కరీంనగర్కు చెందిన ఐదుగురు ట్విట్టర్లో చేసుకున్న విజ్ఞప్తులకు మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన వాసం రాజేశం, కట్టెకోల బాబు, కరీంనగర్కు చెందిన గుండ సంతోష్, హన్మంతరావు, శ్రీభాషం సతీశ్కుమార్ ఇటీవల కరోనా బారినపడి ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందారు. చికిత్స అనంతరం వారికి ఇంటి వద్ద ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ద్వారా కొంతకాలం ఆక్సిజన్ అందించాలని వైద్యులు సూచించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించాలని నిరుపేదలైన బాధిత కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో కోరారు. కేటీఆర్.. ఐదుగురికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పరికరాలను సిరిసిల్లకు పంపించారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో 27వ వార్డుకు చెందిన కట్టెకోల బాబుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పరికరాన్ని అందజేయగా.. మరో నలుగురికి కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు. కేటీఆర్కు బాధిత కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆపదలో రైతు కుటుంబానికి తోడు
సొంత మనిషిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ రైతు కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన రైతు ముత్తంగి శ్రీనివాస్రెడ్డి (45) 25 రోజుల కిందట కరోనా బారినపడ్డాడు. సిరిసిల్లలోని దవాఖానలో చేరాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాధిత కుటుంబసభ్యులు.. దవాఖాన బిల్లు రూ.3.40 లక్షలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నేతలు.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్.. దవాఖాన యాజమాన్యంతో మాట్లాడి రూ.3.40 లక్షల బిల్లును మాఫీ చేయించారు. ప్రత్యేకంగా అంబులెన్స్ను ఏర్పాటుచేసి మృతదేహాన్ని బస్వాపూర్కు తరలించారు. కేటీఆర్కు బాధిత కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
నిమిషాల్లో దవాఖానకే మందులు
‘సర్ అత్యవసరంగా బ్లాక్ ఫంగస్ మందులు కావాలి. ఎక్కడా దొరుకుతలేవు’ అంటూ ఓ బాధితులు చేసిన ట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందించి సాయం అందించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నేతాపురం గ్రామానికి చెందిన ఎరువుల దుకాణం యజమాని కత్తి గోవిందరెడ్డి ఈ నెల 8న కరోనా బారినపడ్డారు. మిర్యాలగూడలోని ప్రైవేటు దవాఖానలో చికిత్సపొంది 19వ తేదీన డిశ్చార్జిఅయ్యారు. రెండ్రోజుల తర్వాత మళ్లీ అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్ ఓ దవాఖానలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్గా గుర్తించారు. సోమవారం శస్త్రచికిత్స చేయాలని, ఆ లోగా పొసకోనజోల్ టాబ్లెట్లను అత్యవసరంగా వాడాలని సూచించారు. మార్కెట్లో మందులు లభించకపోవడంతో గోవిందరెడ్డి బంధువు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు విన్నవించారు. స్పందించిన కేటీఆర్ నిమిషాల వ్యవధిలోనే టాబ్లెట్లను తన సహాయకుల ద్వారా దవాఖాన వద్దకు పంపించారు. రూ.8 వేల విలువైన మందులను కుటుంబసభ్యులకు ఉచితంగా అందించారు. దేవుడిలా ఆదుకున్నారంటూ కేటీఆర్కు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పొరుగురాష్ట్ర బాధితులకూ తక్షణ సాయం
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడి వినతికి స్పందన
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్న ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు.. పొరుగు రాష్ర్టాల బాధితుల సమస్యలపై కూడా తక్షణం స్పందిస్తున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీ కే శివకుమార్ అభ్యర్థన మేరకు ఆ రాష్ర్టానికి చెందిన కుటుంబానికి అండగా నిలిచారు. కర్ణాటకలోని మండ్యకు చెందిన శశికళ భర్త మంజునాథ్ హైదారాబాద్లోని మెడీకవర్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చికిత్స కోసం రూ.7.50 లక్షల బిల్లు అయిందని, తనకు రూ .2 లక్షలు మాత్రమే చెల్లించే స్థోమత ఉన్నదని, మొత్తం బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామంటున్నారని డీకే శివకుమార్కు శశికళ తెలిపింది. ఇదే విషయాన్ని ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. ఆమెకు కావాల్సిన సాయాన్ని వెంటనే చేస్తామని రీట్వీట్ చేశారు. దవాఖాన యాజమాన్యంతో సమన్వయం చేసిన కేటీఆర్ కార్యాలయ సిబ్బంది, శశికళకు భర్త మంజునాథ మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకొన్నారు.