హాలియా, ఆగస్టు 10: అద్దె ఇల్లు ఇచ్చేవారు లేక, కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నేపాలీ కుటుంబానికి మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. నేపాల్లోని కాఠ్మండుకు చెందిన భవాని బహుదూర్ కుటుంబంతో కలిసి నల్లగొండ జిల్లా హాలియాకు 20 ఏండ్లక్రితం వచ్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ రాత్రి సమయంలో గూర్ఖాగా పనిచేస్తూ జీవించేవాడు. అతనికి 8 మంది సంతానం. అందులో ఆరుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం వీరికి రేషన్కార్డు సైతం మంజూరు చేసింది. కాగా, ఇటీవల బహుదూర్ను ఇల్లు ఖాళీ చేయాలని యజమాని కోరాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వారికి హాలియాలో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఉండేందుకు ఇల్లు లేక బహుదూర్ కుటుంబం పడుతున్న ఇబ్బందిని వివరిస్తూ అదే కాలనీవాసి గొట్టిముక్కుల నరేశ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో మెసేజ్ చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కు సూచించారు. ఎమ్మెల్యే భగత్ మంగళవారం సాయంత్రం బహుదూర్ కుటుంబాన్ని కలిశారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు, హాలియా మున్సిపాలిటీలో బహుదూర్కు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. బహుదూర్ పినతండ్రికి పింఛన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యలను వినడంతోపాటు బతుకుదెరువు కల్పించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే భగత్కు రుణపడి ఉంటామని బహుదూర్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.