సాధ్యమైనంత త్వరగా సాయం చేస్తామని ట్వీట్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఎవరున్నా ఆదుకోవడానికి నేనున్నానంటూ అభయమిస్తారు రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు. ప్రాంతాల పరిధులతో పనిలేకుండా కష్టాల్లో ఉన్న ఎవరికైనా ఆపన్నహస్తం అందిస్తుంటారు. రెండు మూత్రపిండాలు పాడై ఎనిమిదేండ్లుగా నరకం అనుభవిస్తున్న యువతి డోనాల గాయత్రికి కూడా అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. సాధ్యమైనంత త్వరగా సాయం చేస్తానని ట్విట్టర్లో బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. గాయత్రిపై ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ బండారు తేజ అనే వ్యక్తి ‘హలో సర్.. నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన 21 సంవత్సరాల గాయత్రి కిడ్నీ వైఫల్యం (రెండు కిడ్నీలు)తో పోరాడుతున్నది. ఈ విషయాన్ని పరిశీలించి ఆమెకు అవసరమైన సాయం చేయగలరా. మీరు ఏ సాయంచేసినా ఎంతో ప్రశంసించబడుతుంది. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘మేము వీలైనంత త్వరగా సహకరిస్తాం బ్రదర్.. కేటీఆర్ ఆఫీస్ దయచేసి సమన్వయం చేయండి’ అని రీ ట్వీట్ చేశారు. గాయత్రి తండ్రి పాల వ్యాపారి. ఆమె వైద్య కోసం ఇప్పటికే మూడు ఎకరాలు అమ్మేశారు. ఇంటిని తాకట్టు పెట్టారు. వైద్యం అందించలేక.. శస్త్రచికిత్స చేయించలేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ వారికి బాసటగా నిలవడంపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.