న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వివిధ బ్యాంకులు రూ.1.15 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ సంగతిని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం ప్రకటించారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా మొండి బాకీలుగా నిర్ధారించిన రుణాలను రద్దు చేశాయని సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో కలిపి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ. 5.85 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అయితే, రద్దు చేసిన రుణాలను, రుణగ్రహీతల నుంచి వసూలు చేసే ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయన్నారు. కానీ రుణాల రద్దు వల్ల రుణ గ్రహీతలకు బెనిఫిట్ చేకూరబోదని స్పష్టం చేశారు. 2018-19లో రూ.2,36,265 కోట్లు, 2019-20లో రూ.2,34,170 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.