జక్రాన్పల్లి, జూన్4: వానకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉద్యమంలా కొనసాగాయి. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది వీధులన్నీ శుభ్రం చేస్తూ ఇండ్లతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. జక్రాన్పల్లి మండలంలోని సికింద్రాపూర్, బాలానగర్ గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో లక్ష్మణ్ పరిశీలించారు. సికింద్రాపూర్లో వైస్ ఎంపీపీ కుంచాల విమల, సర్పంచ్ గంగామణి, ఉపసర్పంచ్ అరుణ్ కుమార్, బాలానగర్లో సర్పంచ్ నిహారిక పాల్గొన్నారు.
మోపాల్ మండలంలో..
మోపాల్ (ఖలీల్వాడి), జూన్4: మోపాల్ మండలంలోని న్యాల్కల్, నర్సింగ్పల్లి, మోపాల్ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆర్డీవో రవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులతోపాటు జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జీపీ సిబ్బందికి సూచించారు.
డిచ్పల్లి మండలంలో..
డిచ్పల్లి, జూన్ 4 : మండలంలోని నర్సింగ్పల్లి, రాంపూర్ గ్రామాల్లో కొసాగుతున్న పారిశుద్ధ్య పనులతోపాటు జ్వర సర్వేను జిల్లా ఉపవైద్యాధికారి తుకారాం రాథోడ్ పరిశీలించారు. ఆయన వెంట మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి వై.శంకర్, వెంకట్ రవి, ఆరోగ్య కార్యకర్తలు స్వర్ణలత, సుజాత, దేవి, మేరీ ఉన్నారు.
కోటగిరి మండలంలో..
కోటగిరి, జూన్ 4: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధు లు దరిచేరవని కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రంలోని వినాయక్నగర్తోపాటు ఆయా కాలనీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి నిల్వ ఉన్న నీటిని గుర్తించి వారికి అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉంటే వాటిపై దోమలు చేరి వ్యాధులు సోకుతాయన్నారు. దోమలతో వచ్చే వ్యాధుల గురించి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేకాధికారి సూచించారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తిరిగి మురికి కాలువలను పరిశీలించారు. తాగునీటి సరఫరా గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీని పరిశీలించారు.
ధర్పల్లి మండలంలో..
ధర్పల్లి, జూన్ 4 : గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎంపీడీవో నటరాజ్ జీపీ కార్యదర్శులను ఆదేశించారు. వానకాలం సీజన్ ప్రారంభమైనందున గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పైపులైన్లు లీకేజీలుంటే మరమ్మతులు చేయించాలని, మురికి కాలువల్లో పూడికతీత పనులను చేయించాలని సూచించారు. పలు గ్రామాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు.
సిరికొండలో..
సిరికొండ, జూన్ 4: మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నం రాజారెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమా లు నిర్వహించారు. వీధులు, డ్రైనేజీల్లో చెత్తను తొలగించారు. వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టారు.
మోస్రా మండలంలో..
(మోస్రా) చందూర్, జూన్ 4: మోస్రా మండల కేంద్రంలో ఎంపీడీవో భారతి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి ట్యాంకులను ఎప్పటికపుప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో వెంట గ్రామ సర్పంచ్ సుమలత, కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఉన్నారు.