కరోనా విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నది. ఆక్సిజన్తోపాటు రెమ్డెసివర్ ఇంజక్షన్లు, మందుల కిట్లను అందుబాటులో ఉంచింది. నల్లగొండ జనరల్ దవాఖానలో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్నివసతులు కల్పించింది. రోగులను నిత్యం పర్యవేక్షించేందుకు 18 మంది వైద్యులు, ముగ్గురు హెడ్ నర్సులు, 12 మంది
నర్సులు, మరికొంత మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. చికిత్స పొందుతున్న రోగులకు రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
రోజుకు రూ.200 ఆహారం
దవాఖానల్లో కరోనా రోగులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందించే ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను ఒకరికి రోజుకు రూ.200 కేటాయించింది. టిఫిన్, స్నాక్స్తోపాటు రెండు సార్లు భోజనం పెడుతున్నారు. ఉదయం పాలు బ్రెడ్తోపాటు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రిపూట రెండు రకాల కూరలు, పప్పు, గుడ్డు, పండ్లు, సాంబారు, పెరుగుతో భోజనం అందిస్తున్నారు. సాయంత్రం డ్రైప్రూట్స్తోపాటు బిస్కెట్లు ఇస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు ఇలానే ఆహారం అందిస్తున్నారు.
అందుబాటులో అన్ని మందులు
నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానతోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, స్టెరాయిడ్స్, రెమ్డెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్లో హెల్త్ కిట్లతోపాటు స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లను సిద్ధంగా ఉంచి అవసరాలకు తగ్గట్టు వాడుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ స్టోర్లో 11890 వాయిల్స్ ఇంజక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 16846 హెల్త్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా పరీక్షల్లో రోగ నిర్ధారణ అయిన వెంటనే వీటిని అందిస్తున్నారు. ఇవే కాకుండా కరోనా నిర్ధారించే కిట్స్ కూడాసరిపడా ఇచ్చారు. ఇంకా 49200 కిట్లు అందుబాటులో ఉన్నాయి.
నిండుగా ఆక్సిజన్ నిల్వలు
జిల్లా జనరల్ దవాఖానలో 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితోపాటు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండలో కూడా ఆక్సిజన్తో కూడిన బెడ్స్ను సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 177 మంది ఆక్సిజన్ను వాడుతున్నారు. నల్లగొండ మినహా మిగతా ప్రాంతాల్లో సిలిండర్ల ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ను అందిస్తున్నారు. నల్లగొండలో మాత్రం 124మంది రోగులకు ప్రతిరోజూ 1.10 కిలోలీటర్ల ఆక్సిజన్ను ఇస్తున్నారు. గతంలో 15 రోజులకు ఒకసారి ప్లాంట్లను నింపుతుండగా కేసులు పెరిగినందున ఇప్పుడు 10 రోజులకు ఒకసారి నింపుతున్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో 77, దేవరకొండలో 70, నాగార్జునసాగర్లో 31, నకిరేకల్లో 18 ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా వాటిని ఎప్పటికప్పుడు నింపి పంపుతున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ప్రస్తుతం 142 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో ప్రారంభమైన ఓపీ సేవలు
హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా జనరల్ ఆసుపత్రి, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్సెంటర్లతోపాటు ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో కూడా ఓపీ సేవలు ప్రారంభించారు. ప్రతిరోజూ కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ మందులు ఇవ్వడం, అవసరమైతే మెరుగైన వైద్యం అందే దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. హైదరాబాద్కు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే కరోనా రోగాన్ని నయం చేస్తుండడంతో ప్రభుత్వ దవాఖానల్లో అందజేస్తున్న వైద్య సేవలపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోలుకున్న 10,700 మంది
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 25 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా 3,172 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక ఏరియా దవాఖానలు, పీహెచ్సీ,యూహెచ్సీల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా జనరల్ దవాఖానలో సుమారు 10,760 మంది కొవిడ్ పేషెంట్స్ చికిత్స పొందగా 10,700 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4 వేల రెమ్డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించారు. కరోనా లక్షణాలున్న వారికి సైతం జిల్లాలో పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు హెల్త్ కిట్లు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు నాలుగున్నర లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.
క్రిటికల్ స్టేజ్లో వచ్చిన వారు సైతం సురక్షితం
కరోనా సెకండ్ వేవ్లో క్రిటికల్ స్టేజ్కు చేరిన వారు సైతం ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి చేరుతున్నారు. రోగులకు ఏ ఇబ్బందీ లేకుండా వైద్యం అందుతున్నది. ప్రైవేట్కు వెళ్లి డబ్బు వృథా చేసుకోకుండా సర్కారు దవాఖానలను వినియోగించుకోవాలి. ఎలాంటి అపోహాలు నమ్మకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ప్రమాద పరిస్థితుల్లో కిట్లు కూడా వాడడం లేదు
మేము ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యసేవలు అందిస్తున్నాం. రోగులను చంటి పిల్లల్లా కాపాడుతున్నాం. సీరియస్ కేసులు వచ్చినప్పుడు పీపీఈ కిట్లు, బ్లౌజులు వాడకుండానే చికిత్స చేయాల్సి వస్తున్నది. రోగుల ప్రాణాలను కాపాడేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.
-రాజేశ్వరి, స్టాఫ్ నర్సు, కొవిడ్ వార్డు,నల్లగొండ