హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల వివాదం, కేంద్రప్రభుత్వం ప్రకటించిన గెజిట్ అమలుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బుధవారం సమావేశం కానున్నది. హైదరాబాద్లోని జలసౌధలో ఉదయం 10.30 మొదలుకానున్న సమావేశ ఎజెండాలో 13 అంశాలను చేర్చారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పలు అంశాలకు కూడా చోటు కల్పించారు. కోర్టు కేసుల కారణంగా గత సమావేశానికి రాలేకపోయిన తెలంగాణ ఈసారి హాజరుకానున్నది. కేఆర్ఎంబీ గత జూలైలోనే త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించాలనుకున్నది. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తేనే అన్ని అంశాలపై చర్చించగలమని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో అది వాయిదాపడింది. ఆగస్టు 9న సమావేశం ఏర్పాటుచేసినా, కోర్టు కేసుల కారణంగా తెలంగాణ హాజరుకాలేకపోయింది. మళ్లీ ఆగస్టు 27న సమావేశం నిర్వహిస్తామని చెప్పిన కేఆర్ఎంబీ అనివార్య కారణాలతో వాయిదా వేసింది. సెప్టెంబర్ 1న సమావేశం ఉంటుందని రెండు రాష్ర్టాలకు మరోసారి లేఖలు రాసింది. సాయంత్రం 4 గంటలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)తో కలిసి కేఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ అమలు అంశాలపై సమావేశం కానున్నది.