హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఈ నెల 9న అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం బోర్డు సభ్యులకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయ్పురే గురువారం లేఖలు రాశారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లోని అంశాలను అమలుచేసే అంశంపై జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడిగా సమన్వయ కమిటీ సమావేశాన్ని 3వ తేదీన నిర్వహించాయి. అయితే గెజిట్పై రెండు తెలుగు రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పూర్తిస్థాయి బోర్డ్డు మీటింగ్ ఏర్పాటుచేయాలని కోరుతూ తెలంగాణ అధికారులు కమిటీ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో సమావేశం అర్థంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జీఆర్ఎంబీతో కలిసి 9న ఎర్రమంజిల్లోని జలసౌధలో అత్యవసర సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
కోర్టు విచారణ ఉన్నది.. మీటింగ్కు రాలేం
జీఆర్ఎంబీ 10వ అత్యవసర బోర్డు సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్కు ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. 9న తమ అధికారులు ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసుల విచారణకు హాజరుకావాల్సి ఉన్నదని, బోర్డు సమావేశానికి హాజరు కావడం వీలుకాదని స్పష్టంచేశారు. రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించిన అనంతరం మరో తేదీన బోర్డు మీటింగ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేరోజు కేఆర్ఎంబీ సైతం నిర్వహించతలపెట్టిన బోర్డు మీటింగ్ సైతం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.