హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి అంతులేకుండా పోయింది. ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలో తొక్కి కృష్ణా నదీ జలాలను పెన్నా బేసిన్కు తరలించుకుపోతున్నది. అందుకు కేసీ కెనాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల బరాజ్ నుంచి కర్నూలు, కడప జిల్లాలకు నీటిని తరలించేందుకు 306 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కేసీ కెనాల్ ద్వారానే పెన్నా బేసిన్కు ఏటా అడ్డూఅదుపూ లేకుండా నీటిని తరలిస్తున్నది.
ముందుచూపు కుట్ర
కేసీ కెనాల్కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 39.90 టీఎంసీల్లో 10 టీఎంసీలను తుంగభద్ర డ్యామ్ నుంచి, 29.90 టీఎంసీలను ఆ డ్యామ్ దిగువన, సుంకేశుల బరాజ్ మధ్య ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శ్రీశైలం కుడి కాలువ (ఎస్ఆర్బీసీ)కు ఏపీ కేటాయించుకున్న 8 టీఎంసీలను మినహాయిస్తే కేసీ కెనాల్ ద్వారా తరలించాల్సిన జలాలు 31.90 టీంఎంలే. కానీ ఏటా అంతకు రెట్టింపుస్థాయిలో కృష్ణా జలాలను మళ్లిస్తున్నది. ముందుచూపుతో శ్రీశైలం బ్యాక్వాటర్పై అక్రమంగా అదనపు ప్రాజెక్టులను నిర్మించి కృష్ణా జలాలను పెన్నాకు దోచుకెళ్తున్నది.
బనకచర్లతో మొదటి గండి
చెన్నై తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి సంబంధించిన 19 టీఎంసీలను తరలించేందుకు మాత్రమే పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల క్రాస్రెగ్యులేటరీని నిర్మించాల్సి ఉండగా, నాటి ఏపీ నేతలు భవిష్యత్తు జలదోపిడీకి వీలుగా విస్తరణ పనులుచేసిపెట్టుకున్నారు. బనకచర్లకు నీటిని సరఫరా చేసే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్ఆర్ఎంసీ) మొత్తం నీటి ప్రవాహ సామర్థ్యం 11,150 క్యూసెక్కులుంటే, క్రాస్ రెగ్యులేటరీ వద్ద ఒక్కో గేట్ను 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో 4 గేట్లు నెలకొల్పి 44వేల క్యుసెక్కుల నీటిని తరలించేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆపై దానినే సాకుగా చూపి నాటి సీఎం వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని కూడా అదేస్థాయికి విస్తరించాడు. ఈ 4 గేట్లలో ఒకటి తెలుగుగంగ, మరొకటి ఎస్ఆర్బీసీకి నీటిని తరలిస్తాయి. మిగిలిన రెండు గేట్లలో స్టాండ్బై పేరిట ఒకటి, ఎస్కేప్ చానల్ పేరిట మరొకటి ఏర్పాటుచేశారు. ఈ ఎస్కేప్ చానల్ ద్వారా నీళ్లు నిప్పులవాగుకు చేరుతాయని చెప్పినా వాస్తవంగా అవి చేరేవి కేసీ కెనాల్కే.
నదినే మళ్లించుకునిపోయేందుకు కుట్ర..
2006 నాటికి ఏపీ పాలకులు ఏకంగా కృష్ణా నదినే మళ్లించుకునిపోయే కుట్రకు తెరలేపారు. స్వయంగా నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డే అందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ వద్ద గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) పథకాన్ని రూపొందించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 798 ఫీట్ల కిందినుంచే కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీకి, అటునుంచి కేసీ కెనాల్కు మళ్లిస్తున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువకు నీటిని తరలించేందుకు మల్యాల లిఫ్ట్ స్కీం తెరమీదకు తీసుకొచ్చారు. ఈ కాలువ ద్వారా కేసీ కెనాల్కు 1,000 క్యుసెక్కుల కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. ఇలా ఒక్క కేసీ కెనాల్ ద్వారానే 25 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను బేసిన్ అవతలికి ఏపీ సర్కారు తరలిస్తున్నది.
ఈ జల దోపిడీని మరింత విసృ్తతం చేస్తూ ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్లో 798 ఫీట్ల దిగువ నుంచే 88,000 క్యూసెక్కుల నీటిని నిరంతరాయంగా ఎత్తిపోసుకొనే వీలుంటుంది. అంటే ఏకంగా కృష్ణా నదినే మళ్ళించేలా జల దోపిడీకి ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. మరోవైపు ఆర్డీఎస్కు కేటాయించిన 15.90 టీఎంసీల్లో 5 టీఎంసీల నీరు కూడా తెలంగాణకు రావటంలేదు. ఏపీ అక్రమ తరలింపుతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.