హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీలో జరిగిన అన్యాయంపై అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ వాయిదా పడింది. కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం విచారణ జరిపేందుకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించగా దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం జలాల పంపిణీ చేపట్టేలా ట్రిబ్యునల్ను ఆదేశించాలని కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరగా, పిటిషన్ను ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్కు సిఫారసు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా అప్పటికే కోర్టు సమయం మించిపోవడంతో కేసు వాయిదా పడింది. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశముందని తెలుస్తున్నది.