హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లను వెంటనే అందజేయాలని.. వాటికి ఆరునెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆయా నదీ యాజమాన్యబోర్డులు సూచించాయి. కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలు కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)లు ఏర్పాటుచేసిన సబ్ కమిటీలు శుక్రవారం జలసౌధలో వేర్వేరుగా సమావేశయ్యాయి. గెజిట్లోని పలు అంశాలపై చర్చించాయి. ప్రధానంగా ప్రాజెక్టుల నిర్వహణ, అందుకు ఏర్పాటుచేయాల్సిన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంశాలపై కమిటీల సభ్యులు ఇరు రాష్ర్టాల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇప్పటికే నిర్వహణలోఉన్న ప్రాజెక్టుల వద్ద రూ.కోటికి మించి పనులు కొనసాగుతున్నట్టయితే అందుకు సంబంధించిన వివరాలను, ఆయా కాంట్రాక్టర్ల జాబితాను అందజేయాలని సూచించారు. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రత అంశాన్ని జ్యూరిస్డిక్షన్ పూర్తిగా అమలులోకి వచ్చాక పరిశీలించాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఆయా ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏర్పాటుకు వీలుగా సత్వరమే అధికారుల జాబితాను అందజేయాలని సూచించారు. ఇటీవల కేంద్రం నియమించిన సీడబ్ల్యూసీ సీఈలు త్వరలో బాధ్యతలను స్వీకరిస్తారని, వారు వచ్చేలోగా జాబితాలను అందజేయాలని, అటు తరువాత మరోసారి సమావేశమై దీనిపై చర్చించాల్సి ఉంటుందని బోర్డులు తెలిపాయి. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న వినియోగంలోకి రాని, పాక్షికంగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను కూడా అందజేయాలని బోర్డులు సూచించాయి. ఇదిలాఉండగా ఆ జాబితా నుంచి శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని సబ్ కమిటీ తిరస్కరించింది. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, ముందయితే వివరాలను అందజేయాలని స్పష్టం చేసింది. పదిరోజుల్లో డీపీఆర్లను అందజేస్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారు.