సుల్తాన్బజార్, మే 10: వైద్యవిధాన పరిషత్ కింగ్కోఠి జిల్లా దవాఖానలో ఎల్లప్పుడూ కనీసం రెండ్రోజులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని దవాఖాన కో ఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. దవాఖానలో 13కేల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్తోపాటు, తక్షణ సాయంగా 46 కేజీల స్థాయి డీ టాక్స్ సిలిండర్లు ఉంటాయని వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత దవాఖానలో ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు మృతిచెందారనే వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ట్యాంకర్ ఆలస్యం కారణంగా ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు మృత్యువాత పడ్డారంటూ వచ్చిన వార్తలపై డాక్టర్ మల్లికార్జున్ స్పందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారితోపాటు, సివియర్ లక్షణాలతో అడ్మిట్ కావడానికి వచ్చినవారే మృతిచెందారని తెలిపారు. అంతేకానీ, వారి మృతికి ఆక్సిజన్ సరఫరాకు సంబంధం లేదని వివరించారు. దవాఖానకు ఆక్సిజన్ను తెచ్చే ట్యాంకర్ రోజువారీ సమయంలో కాకుండా మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత వచ్చింది వాస్తవమేనని.. దీంతో లిక్విడ్ ప్లాంట్లో ఆక్సిజన్ అయిపోతుందని భావించిన సిబ్బంది ఐసీయూ, వార్డుల్లోని రోగులకు అందించేందుకు డీటాక్స్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. కానీ దవాఖానలో ఆక్సిజన్ పూర్తిస్థాయిలో నిలిచిపోయిందనే విషయం మాత్రం అవాస్తవమని వివరించారు. వైద్య విధాన పరిషత్ కింగ్కోఠి జిల్లా దవాఖాన గతేడాది మార్చినుంచి 350 పడకలతో పూర్థిస్థాయి కొవిడ్ కేంద్రంగా బాధితులకు చికిత్స అందిస్తున్నదని డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు.