కాగజ్నగర్ : సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పం గొప్పదని ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ అన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సాహితీ దిగ్గజం, కేంద్ర సాహిత్య అకాడమీ పురష్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టారు కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, భాస్కర్రావు, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి కలిసి ఆవిష్కరించారు. అనంతరం కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యన్నదాన సత్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కోనప్ప ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఇక్కడ ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులు ఎనలేని కృషి చేస్తున్నారని, నిత్యాన్నదానం, నిత్య కల్యాణం కావాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ సిర్పూరు నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు తనని ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. వారి రుణం తీర్చుకోవాలనే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి రోజూ 1000 మందికి పైగా భోజనం పెట్టాలనే లక్ష్యంతో నిత్యాన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని, అవసరమైతే రాజకీయం వదిలి పెడుతాను కానీ.. అన్నదానం చేయడం వదిలిపెట్టబోనన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ప్రజలకు సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు.