దోమలపెంట వద్ద రోడ్డు ప్రమాదం
కారును ఢీకొన్న స్కార్పియో
సీఏ విద్యార్థిని మృతి
అచ్చంపేట, ఏప్రిల్4: ఆగిఉన్న కారును వెనుక నుంచి స్కార్పియో ఢీకొన్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శివారులో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన నక్కల సత్తయ్య హైదరాబాద్లో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఎల్బీనగర్లోని చింతలకుంట కాలనీలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం జరుగగా రెండో కుమార్తె నక్కల శివాని హైదరాబాద్లో సీఏ చదువుతున్నది. ఆదివారం తెల్లవారుజామున సత్తయ్య కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రెండు కార్లల్లో ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రం దైవదర్శనానికి బయలుదేరారు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట శివారులో ఓ కారును రోడ్డు పక్కన నిలిపారు.
ఆ సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు అతివేగంగా వెళ్తున్న స్కార్పియో (ఏపీ 20ఏకే 1116) ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో కారు వద్ద నిల్చున్న నక్కల శివాని (21)ని స్కార్పియో ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లగా తీవ్రంగా గాయపడింది. వెంటనే అచ్చంపేట దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ముందుగానే గమనించి డ్రైవర్ రవి కారులోంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకోగా మిగిలిన ముగ్గురు బయట ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్కార్పియోలోని వారికి కూడా గాయాలయ్యాయి. ఈగలపెంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివాని మృతదేహానికి అచ్చంపేట దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. స్కార్పియో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.