సిద్దిపేట, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సిద్దిపేట జోన్/ అర్బన్: సిద్దిపేట బల్దియాపై మరోమారు గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది. సిద్దిపేట పుర ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. స్థానిక మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు గాను టీఆర్ఎస్ పార్టీ 36 గెలుచుకుంది, బీజేపీ 1, స్వతంత్రులు 5, ఎంఐఎం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేయగా, బీజేపీ 40 స్థానాల్లో పోటీచేసి కేవలం 1 స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో పోటీచేసి ఒక్కసీటు గెలుచుకోక పోవడంతో పాటు నామమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. కాగా, టీఆర్ఎస్ 36 వార్డులు గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన ఆ పార్టీ రెబల్స్ ఐదుగురు గెలుపొందారు. వారు టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారు చేరితే టీఆర్ఎస్ బలం 41కు చేరుకుంటుంది.
ఓట్ల లెక్కింపు సాగిందిలా…
సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సోమవారం సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రెండు హాళ్లలో కౌంటింగ్ చేపట్టారు. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. కౌంటింగ్ హాల్-1లో మొదటి రౌండ్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రౌండ్-2లో 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 వార్డుల ఓట్లను లెక్కించారు. కౌంటింగ్ హాల్-2లో మొదటి రౌండ్లో 13, 14, 15,16, 17, 18, 19, 20, 21. రౌండ్-2లో 34, 35, 36, 37, 38, 39 ,40, 41, 42, 43 వార్డుల ఓట్లను లెక్కించారు. మధ్యాహ్నం వరకు తొలి రౌండ్ ఫలితాలు రాగా, సాయంత్రం 6.30 తర్వాత చివరి ఫలితాలు వచ్చాయి. బ్యాలెట్ పేపర్లు కావడంతో ఆలస్యమైంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ను నిర్వహించారు.
టీఆర్ఎస్కు సిద్దిపేట కంచుకోట:రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట నాడు తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిందని, నేడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని, టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట కంచుకోట అని ఇక్కడి ప్రజలు మరోసారి తీర్పునిచ్చారని, అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 36 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందిందన్నారు. 5 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు స్వతంత్రులుగా గెలుపొందారని తెలిపారు. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు కేవలం ఒక్కో స్థానంలో మాత్రమే గెలుపొందారన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై నమ్మకం, విశ్వసనీయతకు నిదర్శమని తెలిపారు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ప్రజలు గొప్ప చైతన్యవంతులని, వారికి మంచి సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులకు సూచించారు.
స్వతంత్రులతో 39కి చేరిన టీఆర్ఎస్ బలం..
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 36 స్థానాల్లో గెలుపొందింది. స్వతంత్రులుగా పోటీచేసి గెలుపొందిన ఐదుగురిలో టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు వచ్చి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ రెబల్స్ మళ్లీ సొంతగూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ బలం మరింతగా పెరుగుతున్నది. సోమవారం రాత్రి మంత్రి హరీశ్రావు నివాసంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో 20వ వార్డు స్వతంత్ర ( టీఆర్ఎస్ రెబల్) అభ్యర్థి రియాజ్, 35వ వార్డు స్వతంత్ర ( టీఆర్ఎస్ రెబల్) అభ్యర్థి భూంపల్లి శ్రీలత శ్రీహరి, 43వ వార్డు స్వతంత్ర ( టీఆర్ఎస్ రెబల్) అభ్యర్థి పయ్యావుల పూర్ణిమా ఎల్లయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. మిగతా వాళ్లు నేడు చేరనున్నట్లు సమాచారం.