హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం భాషా సాంస్కృతిశాఖ ఆధ్వర్యంలో బాపూజీ 106వ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా దత్తాత్రేయ హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసి, రాష్ట్రం వచ్చేవరకు ఏ పదవీ చేపట్టనని శపథంచేశారని తెలిపారు.జలదృశ్యంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, పాఠ్యపుస్తకాల్లో జీవిత చరిత్రను పొందుపరిచి నేటి యువతకు తెలియజేయాలని సూచించారు. మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిందని చెప్పారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు త్వరలోనే జలదృశ్యంలో బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం సిరిసిల్లలో చేనేత వృత్తిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని, చేనేత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బాపూజీ స్ఫూర్తితోనే తాను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ఎస్ నేత ఎల్ రమణ, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబురావు, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.