హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జూపార్క్లో ఇండియన్ బైసన్ జాతికి చెందిన అడవిదున్న కూనకు పెట్టిన కుమ్రంభీం పేరును అధికారులు ఉపసంహరించుకొన్నారు. అభ్యంతరాలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. జూపార్క్లో ఓ అడవిదున్న మగదూడకు జన్మనిచ్చింది. ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ దూడకు కుమ్రంభీంగా నామకరణం చేశారు. అదేరోజు ఖడ్గమృగానికి పుట్టిన ఆడకూనకు నందా అనే పేరుపెట్టారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీం పేరును జంతువుకు పెట్టడంపై ఆదివాసీలు అభ్యంతరం వ్యక్తంచేస్తూ అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కుమ్రంభీం పేరును ఉపసంహరించుకొన్నట్టు ప్రకటించారు. నిజాంపాలకులకు వ్యతిరేకంగా పోరాడిన కుమ్రంభీంను గౌరవిస్తూనే ఈ పేరుపెట్టినట్టు అధికారులు తెలిపారు. మరో ఉద్దేశం లేదని స్పష్టంచేశారు.