Kollapur Mango | నాగర్కర్నూల్, మే 24 (నమస్తే తెలంగాణ): కొల్లాపూర్ మామిడి పండ్లు ప్రస్తుతం మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. రుచిలో అమృతం, రూపంలో బంగారు వర్ణంతో పోటీ పడే ఈ మామిడి పండ్లు ప్రజలకు ఎండాకాలం లో తీపిని పంచుతున్నాయి. ఉమ్మడి పాలమూరుతోపాటు రాష్ట్రం, దేశ సరిహద్దులుదాటి అం తర్జాతీయ స్థాయిలో కొల్లాపూర్ మామిడి ఆదరణ పొందుతున్నది. సురభి రాజుల కాలంలో పురుడుపోసుకున్న ఈ మామిడి.. రుచిలో రా రాజుగా నాగర్కర్నూల్ జిల్లాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. 120 ఏండ్ల కిందట సురభి వంశ రాజులు ఈ మామిడి తోటలను ప్రారంభించారు. నూజివీడు నుంచి తీసుకొచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్లోని తమ కోటలో సాగు చేశారు. ఇక్కడి వాతావరణం, నేలలు అనుకూలించి మామిడి పండ్ల సైజు, రుచి నూజివీడును మించిపోయింది. కొల్లాపూర్ నేలల్లో టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ అధికంగా ఉండటంతో మామిడి పంటకు ప్రత్యేకత ఏర్పడింది. పండులోని కండ మెత్తగా ఉం డటం, పీచులేకపోవడం, అధికంగా మచ్చలు లేకపోవడం, తీయగా ఉండటంతో ఈ మా మిడి తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.
కొల్లాపూర్లో బంగినపల్లి, బేనిషా, రసాల రకాల మామిడిని అధికంగా పండిస్తున్నారు. ఇందులో బేనిషాను అధికంగా ఇష్టపడుతారు. ఈ పండ్లను కొల్లాపూర్ ప్రజలు తమ బంధువు లు, మిత్రులకు, రాజకీయ నేతలు, స్నేహితులకు పంపిస్తుంటారు. ఈ ఆచారం సురభి రా జుల కాలం నుంచి వస్తున్నది. ఎండాకాలం వచ్చిందంటే కొల్లాపూర్ నుంచి ఈత, ప్లాస్టిక్ బుట్టల్లో మామిడి పండ్లను పంపించి తమ స్నేహాన్ని, బంధుత్వాన్ని చాటుకుంటుంటారు.
కొల్లాపూర్లో సాగైన మామిడి ఇప్పుడు దేశవిదేశీ మార్కెట్లలో సందడి చేస్తున్నది. కిలో రూ.30 నుంచి రూ.50 వరకు పలుకుతున్నది. చాలా మంది వ్యాపారులు తోటల వద్దకే వచ్చి పండ్లను తీసుకెళ్తున్నారు. ఇలా ప్రజల ఆదరణ ఉన్న ఈ మామిడిని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం సబ్సిడీలు సైతం ఇస్తున్నది. ఉద్యానవన శాఖలో రైతులకు తోటల పెంపకంతోపాటు మామిడి దిగుబడి వచ్చాక విక్రయించేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో కొనుగోళ్లను సైతం చేపడుతున్నది. అందువల్ల రైతులు మామిడి పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈ సంవత్సరం 14,458 మంది రైతులు 34,712 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలను సాగు చేయగా.. 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రైతుల చిరకాల వాంఛ అయి న ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. స్థల సేకరణ పూర్తయిన తరుణంలో రాబోయే కాలంలో ఈ నిర్మాణం పూర్తైతే కొల్లాపూర్ మామిడికి, రైతులకు మరింత మేలు చేకూరనున్నది.
కొల్లాపూర్ నేలల్లో పోషకాలు అధికంగా ఉండటంతో కొల్లాపూర్ మామిడికి ఆదరణ పెరిగింది. రుచితో పాటు చూసేందుకూ పండ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. జిల్లాలో ఈ ఏడాది 34 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. సీజనల్గా దొరికే పండ్లల్లో మామిడి ఎంతో విశిష్టత కలిగి ఉన్నది.
-చంద్రశేఖర్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి