వరుసగా ఫ్లాపులు వస్తున్న కూడా మార్కెట్ పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. హీరోలంతా విజయ్ దేవరకొండ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ తర్వాత వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి ఈ హీరోకు. భారీ అంచనాలతో వచ్చిన ‘నోటా’, ‘డియర్ కామ్రెడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి. దీని కోసం ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ‘లైగర్’ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానంటూ ఇదివరకే ప్రకటించాడు. దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయిపోయింది. పూరి సినిమా అయిపోగానే సుకుమార్ సినిమాతో విజయ్ బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అందరూ అనుకుంటున్నట్లు సుకుమార్ తర్వాత సినిమా విజయ్ దేవరకొండతో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కాకుండా మరో స్టార్ హీరోను సుకుమార్ లైన్లో పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ లోపు విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ సినిమా పూర్తి చేయనున్నాడు. అయినా కూడా విజయ్ ని కాదని.. మరో హీరోతో సుక్కు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయినట్లు కాదు. ఇది ఒక వార్ డ్రామా అని.. దీనికి భారీ బడ్జెట్ తో పాటు టైం కూడా ఎక్కువగా అవసరం పడుతుందని తెలుస్తుంది. అందుకే మరి కొన్నాళ్లు అయిన తర్వాత విజయ్ దేవరకొండ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు సుకుమార్. ఒకవేళ ఇదే జరిగితే విజయ్ తర్వాత సినిమా ఏ దర్శకుడితో ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకూ పూరి సినిమా తర్వాత సుక్కు కాకుండా మరే దర్శకుడికి విజయ్ ఓకే చెప్పలేదు.