న్యూఢిల్లీ: అసలే కరోనా కాలం.. అటుపై వచ్చే నెలలో పెండ్లిండ్ల సీజన్.. వివాహాల వేళ మగువలు బంగారు ఆభరణాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.. తాజాగా అబ్బాయిల్లోనూ ఆభరణాల పట్ల ఆసక్తి పెరిగింది. అయితే, గతంలో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. తాజాగా కరోనా మహమ్మారి ప్రభావంతో బంగారం ప్రియం అవుతున్నది. గతేడాది మాదిరిగానే కరోనా రెండో వేవ్ కేసులు పెరుగుతున్నా కొద్దీ బంగారం, వెండి ధరలు జెట్ స్పీడ్లో పెరుగుతున్నాయి.
కేవలం ఈ నెలలో ఇప్పటి వరకు బంగారం ధర ఏడు శాతం పెరిగి తులం రూ.47,169కు చేరింది. మహమ్మారి ప్రభావంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారాన్నే నమ్ముకున్నారు.
కనుక మున్ముందు పసిడి ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెలలోనే రూ.2,979 పెరిగింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ తులం బంగారం ధర రూ.47,350కి చేరుకున్నది.
బంగారంతోపాటు వెండి కూడా పోటీ పడుతున్నది. ఈ నెలలో తొమ్మిది శాతం ధర పెరిగింది. గత నెల 31వ తేదీన కిలో వెండి ధర రూ.62,862 పలికితే, ఇప్పుడది రూ.68,810లకు చేరిపోయింది. అంటే ఈ నెలలో కిలో వెండి ధర రూ.5,948 ఎక్కువైంది.
మళ్లీ తులం బంగారం రూ.52 వేల మార్క్ను చేరుతుందంటున్నా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కమొడిటీస్ అండ్ కరెన్సీ ఉపాధ్యక్షుడు అనూజ్ గుప్తా. మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా బంగారం ప్రియమవుతుందంటారాయన.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతుందని అనూజ్ గుప్తా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసిన వారికి బెనిఫిట్ కలుగుతుందన్నారు. మున్ముందు మళ్లీ తులం బంగారం ధర రూ.50-52 వేలను తాకవచ్చునన్నారు.
అనిశ్చిత పరిస్థితులు, ఒడిదొడుకులు నెలకొన్నప్పుడల్లా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఉంటారు.
ఆ సొమ్మును బంగారంలో పెట్టుబడిగా పెడుతుంటారు. దీంతో దాని ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరుగుతుంటాయి. అలాగే వెండి ధరలు కూడా పైపైకి వెళుతున్నాయి.
త్వరలో వివాహాల సీజన్ మొదలవుతుండటంతో బులియన్ మార్కెట్లో బంగారం వాడకం పెరుగుతుంది. దీనికి తోడు గత నెల రోజుల్లో రూపాయిపై డాలర్ మారకం విలువ బలోపేతం అవుతున్నది.
ప్రస్తుతం ఒక డాలర్.. రూ.75 పలుకుతున్నది. ఇది కూడా బంగారం ధర పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నది.
దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా రెండో వేవ్ మొదలైందని కెడియా కమోడిటీ డైరెక్టర్ అజయ్ కెడియా చెప్పారు. దీనివల్ల ప్రజల్లో మళ్లీ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో స్టాక్స్లో ఒడిదొడుకుల వల్ల బంగారానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అందుకు పసిడి పైపైకి దూసుకెళ్తున్నది.
స్మార్ట్గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు