హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నల్సార్-ఎఫ్టీసీసీఐ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్) కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సహకారం అందిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హామీఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) కార్యాలయంలో దీని ఏర్పాటుతో తెలంగాణకే కాకుండా పొరుగు రాష్ర్టాలకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనానీ అధ్వర్యంలో పలువురు ప్రతినిధులు గురువారం రాజ్భవన్లో చీఫ్ జస్టిస్ను కలిసి ఏడీఆర్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఇందులో వివాద పరిష్కారాలకు సంబంధించి మధ్యవర్తిత్వంపై నైపుణ్యాభివృద్ధి తరగతులు కూడా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ ఏడీఆర్ ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని, దీనికి పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. సింగపూర్, లండన్, యూఏఈ తరహాలోనే దేశంలో కూడా అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం ఉండాలని ఆకాంక్షించారు.