న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గంటల వ్యవధిలోనే ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవ్వనున్నాయి? ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేది ఎవరు? అనే విషయాలు మరికొద్ది గంటల్లో తేలిపోనున్నాయి.
మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకుగాను 2.7 లక్షల పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో.. 18.68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. కరోనా మహమ్మారి వేళ నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల మూడంచెల భద్రత కల్పించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), కర్ణాటక (బెల్గాం), కేరళ (మలప్పురం), తమిళనాడు (కన్యాకుమారి)లోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా జరుగుతోంది. మరో పది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల కౌంటింగ్ సైతం ప్రారంభమైంది.