తిరుమల : అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ మధ్య బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. 15న 8.30 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. 18న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణం జరుగనుంది.
ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. 22న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల మధ్య శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా జరుపుతారు. 27న ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులతో పాటు సుదర్శన చక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుంచి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.