సంగారెడ్డి : పదకొండు నెలల ఓ చిన్నారి చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంది. పాప ప్రాణాలు దక్కాలంటే 16 కోట్ల రూపాయలు అవసరం. అంత స్థోమత లేని సిద్దిపేట జిల్లాకు చెందిన ఆ పేద జంట ఆదుకునేవారి కోసం, ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కిరణ్ కుమార్ యాదవ్, సునీతా ఇరువురు దంపతులు. కిరణ్ స్టేట్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పటాన్చెరు సమీపంలోని ఇస్నాపూర్లో నివసిస్తున్నారు.
వీరికి మార్చి 2020లో ఓ పాప జన్మించింది. పేరు విజయదుర్గ. పాపకు ఒకటో సంవత్సరం పూర్తయ్యేలోపే జీవితంలో అతిపెద్ద యుద్ధంతో పోరాడుతుంది. దీనిపై కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన తర్వాత ఆరు నెలలు గడిచిన పాప తన తలను స్ట్రయిట్గా ఉంచలేకపోతోంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించాం. పరీక్షలన్ని చేసి అరుదైన వ్యాధితో పాప బాధపడుతుందని దాని పేరు స్పైనల్ మస్కులర్ అట్రోపి టైప్-1(ఎస్ఎంఏ టైప్-1) అని చెప్పారు. ట్రీట్మెంట్ నిమిత్తం రూ. 4 లక్షలు ఖర్చుచేశాం.
కాగా జోల్జెన్స్మా అనే ఒక అరుదైన ఇంజెక్షన్ను అమెరికా నుండి తెప్పించి వేయాలని దానికి రూ.16 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. పాపకు రెండేళ్లు వచ్చేసరికి ఆ ఇంజక్షన్ వేయాలని లేకపోతే పాప బ్రతకడం కష్టమని తెలిపారు. అంత పెద్ద మొత్తాన్ని భరించే స్థోమత తమకు లేదని దాతలెవరైనా ముందుకువచ్చిగానీ, ప్రభుత్వంగానీ సాయం చేసి తమ పాపను బ్రతికించాల్సిందిగా దంపతులు వేడుకుంటున్నారు.