హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణేష్ విగ్రహాలలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఒకటి. పది రోజుల పాటు కొనసాగే గణేష్ చతుర్థి వేడుకల్లో వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటారు. గతేడాది కొవిడ్-19 మహమ్మారి కారణంగా విగ్రహం ఎత్తు 9 అడుగులకే పరిమితం చేయబడింది. అంతకుక్రితం 2019లో 61 అడుగులుగా ఉంది. కాగా ఈ ఏడాది విగ్రహం ఎత్తు పెంచుతూ 40 అడుగులుగా నిర్ధారించారు. 2021 అవతారం ఏకాదశ రుద్ర మహా గణపతి – లక్ష్మీ దేవి, పార్వతి దేవి దేవతల విగ్రహాలతో కూడి ఉంటుంది. ఈ ఏడాది థీమ్ కరోనా సంక్షోభం నుంచి తిరిగి పునరుజ్జీవనం.
ఖైరతాబాద్ గణేషుడి రూపశిల్పి రాజేంద్రన్ చిన్న పూజ అనంతరం ఈ ఏడాది విగ్రహం పని ప్రారంభించారు. విగ్రహ తయారీలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు హస్తకళాకారులు పాల్గొంటారు. దేశంలో మూడో దశ కరోనా వేవ్ దృష్ట్యా ఈ సంవత్సరం కూడా గణేశ్ ఉత్సవ శోభ అంత ఆడంబరంగా ఉండకపోవచ్చు.
సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి శనివారం తెలిపింది. ఈ ఏడాది కొవిడ్ జాగ్రత్తలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్రావు పేర్కొన్నారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్ 10న ప్రారంభమై.. 19వ తేదీ ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ముగియనున్నట్లు పేర్కొన్నారు.