హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన భేటీ కానున్నది. ఈ నెల 25 నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరునెలలు పూర్తవుతున్నందున ఈలోగా సమావేశపరచాల్సి ఉన్నది. వాటి తేదీలను క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. దళితబంధు పథకంపై ఇచ్చే స్టేట్మెంట్పైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కృష్ణా జలాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నది. విద్యుత్తు వివాదం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, నియామకాల నోటిఫికేషన్ చర్చకు రానున్నట్టు సమాచారం. వినాయక నిమజ్జనంపై సుప్రీంలో రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్ గురువారం విచారణ జరుగనున్న నేపథ్యంలో ఆ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.