హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రామచంద్రరావు ‘ఓం ణమో’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికవడం పట్ల పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేసిన కృషికి ఫలితం వచ్చిందని పేర్కొన్నారు.
రామచంద్రరావు పూర్వీకులది మైసూరు సమీపంలోని చామరాజనగర్. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేసేందుకు ఆయన అనువాద రచనను ఎంచుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకరకంగా తన అనువాదాలతో తెలుగు, కన్నడ సాహితీ రంగాలకు ఆయనొక వారధిగా ఉన్నారు. దాదాపు 350 పైచిలుకు కథలను రామచంద్రరావు తెలుగు సహా వివిధ భాషల్లోకి అనువదించారు. కథకుడిగా, అనువాదకుడిగా సాహితీ రంగంలో రామచంద్రరావు విశేష కృషి చేస్తున్నారు.