మహబూబ్నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకటి కాదు, పదులు కాదు ఏకంగా 2,087 ఎకరాలు.. సుమారు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అడగడుగుకు నాటిన మొక్కలు లక్షల వృక్షాలుగా మారాయి. వందల సంఖ్యలో జింకలు చెంగుచెంగున దుంకుతున్నాయి. వేలాదిగా నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. వివిధ రకాల పక్షుల కిలకిలరావాలు మనసును ఆహ్లాదపరుస్తున్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి. ఇక చిరుతలు, హైనాలు, అడవి పందులు, నక్కలు, అడవి కుక్కలు, పాములు ఇలా ఇంకెన్నో.. మరెన్నో.. బట్టర్ఫ్లై గార్డెన్, రాశీవనం, హెర్బల్ గార్డెన్, నవగ్రహ వనం ఇలా ఎన్నో పచ్చని అందాలకు చిరునామాగా మారింది మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు. ఇది దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కుగా నిలిచింది. ఉమ్మడి పాలనలో పర్యాటకమే ఎరుగని పాలమూరుకు ఇప్పుడు కొత్త కళ వచ్చింది. కనుచూపుమేర కనిపిస్తున్న పచ్చదనం పర్యాటకులకు నెలవుగా మారింది. కేసీఆర్ పార్కులో ట్రెక్కింగ్ చేసేందుకు అనువుగా ఉండటంతో చాలామంది సాహస క్రీడలకు అడ్డాగా మార్చుకున్నారు. కేబుల్ సైక్లింగ్, బాంబో బ్రిడ్జి, వాల్ ైక్లెంబింగ్, బోటింగ్, నైట్ క్యాంపింగ్, బ్యాటరీ వెహికిల్స్ వంటివి ఔత్సాహికులను రారమ్మని పిలుస్తున్నాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి పర్యాటకులు పార్కును సందర్శిస్తున్నారు. గురువారం అసెంబ్లీలో హరితహారంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును కొనియాడారు. దీంతో మరోసారి అందరి దృష్టి ఈ పార్కుపై పడింది. పార్కు సంరక్షణకు ముందు మహబూబ్నగర్ పట్టణంతో సమానంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు ఉండేవని ఫారెస్ట్ డిఫ్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్ తెలిపారు. పార్కు అభివృద్ధి, హరితహారం కార్యక్రమం ఊపందుకున్న తర్వాత పచ్చదనం భారీగా పెరగడంతో పట్టణంతో పోలిస్తే పార్కులో సుమారు 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో మహబూబ్నగర్ రూపురేఖలే మారాయి. వలసలు తగ్గి, పాలమూరుకే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. ఒకప్పుడు పచ్చని పార్కు కనపడని పరిస్థితి నుంచి నేడు దేశంలోనే అతి పెద్ద అర్బన్ ఎకో పార్కు ఏర్పాటు చేసుకొనేస్థాయికి చేరుకున్నాం. ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ పేరిట అతిపెద్ద అర్బన్ ఎకో పార్కును ఏర్పాటుచేయడం సంతోషంగా ఉన్నది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేలా పార్కును తీర్చిదిద్దుతాం.
–వీ శ్రీనివాస్గౌడ్, పర్యాటకశాఖ మంత్రి