హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గ్రామాలు అభివృద్ధికావాలంటే పంచాయతీ ఆస్తులు కుదువబెట్టుకోవాలని కేంద్రం ఉచిత సలహాలు ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్రం.. మొండి చేయి చూపిస్తున్నదని, ఏటా నిధులు పెంచాల్సింది పోయి.. ఉన్న దాంట్లో కోత విధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదీ బీజేపీ మార్కు అభివృద్ధి అని విమర్శించారు. కేంద్రానికి మనం ఎక్కువ నిధులు అందిస్తున్నా.. రాష్ర్టానికి కేంద్రం ఇస్తున్నది చాలా తక్కువని స్పష్టంచేశారు. కేంద్రం నిధులు భిక్ష కాదని, రాష్ర్టాల హక్కని తేల్చి చెప్పారు. గురువారం శాసనసభలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. గ్రామాల అభివృద్ధిలో కేంద్రం వైఖరి విచిత్రంగా ఉన్నది. ఒక ఫైనాన్స్ కమిషన్ నుంచి మరో ఫైనాన్స్ కమిషన్కు నిధులు పెంచాలి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసును పరిగణనలోకి తీసుకొని లోకల్బాడీలకు ఇచ్చే నిధుల్లో 25% కోత విధించింది. దీంతో.. గతంలో మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.1847 కోట్లు వస్తే ఇప్పుడు రూ.1365 కోట్లు మాత్రమే వస్తున్నాయి. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నుంచి మనకు అందుతున్న సహకారం ఇదీ. కోత పెట్టడంతో నిధుల సమస్య ఏర్పడుతున్నది. పైగా.. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఆఫీసును, గ్రామాల ఆస్తులను కుదువ పెట్టుకోమని చెప్తున్నది. ఇంటింటికీ మంచినీళ్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథను అమలు చేస్తే.. బ్రహ్మాండంగా ఉన్నదంటూ నీతి ఆయోగ్ కితాబిచ్చింది. ఈ పథకానికి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. అవార్డు మాత్రం ఇచ్చారు. కేంద్రం నుంచి తెలంగాణకు శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు మాత్రమే.
కొత్త రాష్ట్రమే అయినప్పటికీ దేశానికి ఆదాయం సమకూర్చే నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆర్బీఐ చెప్పింది. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి కండ్ల ముందే ఉన్నది. ఉద్యమంలో వాదించాను, సీఎం అయ్యాక చాలాసార్లు చెప్పాను.. తెలంగాణ ధనిక రాష్ట్రం అని. కాబట్టే దేశంలో ఎవరికీ ఇవ్వని జీతాలు ఇవ్వగలుగుతున్నం. రాష్ట్రం ఏర్పడితే కేంద్ర ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతం వస్తుందని చెప్పిన. ఈ రోజు ఇస్తున్నాం.
కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నారని అంటున్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి వివిధ రకాలుగా పన్నులు వసూలు చేస్తాయి. అన్నింటినీ కలిపి ప్రాధాన్యం ప్రకారం ఖర్చు చేస్తారు. కేంద్రం ఇచ్చేది చాలా తక్కువ. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అనేది మన హక్కు. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపుల్లో స్థానిక సంస్థలకు వాటా ఆటోమెటిక్గా వచ్చేది. దానికి యుద్ధం చేయాల్సిందేం లేదు. కేంద్రం నుంచి వచ్చేది సీఎస్ఎస్ ఒక్కటే.
రాష్ట్రాల హక్కులను నాశనం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్రం ముందుగా చట్టం తెస్తే వారిదే ఫైనల్ అవుతున్నది. ఈ అంశం అంబేద్కర్ దృష్టికి రానట్టున్నది. ఇలా కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాల హక్కులను లాగేస్తున్నాయి. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం మనది! కూలీలకు డబ్బులు డైరెక్ట్గా ఢిల్లీలో వేస్తం అంటరు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, సర్పంచులు ఎందుకు? ఇంత దారుణంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. రాష్ట్ర శాసనసభగా, ప్రభుత్వంగా తప్పకుండా మనం నిరసన తెలియజేస్తం.
జీఎస్టీ రూపంలో కేంద్రం పన్నులు తీసుకొంటున్నది. మొన్న పెట్రోల్, డీజిల్ పన్నులు కూడా తీసుకుంటామని మొదలుపెట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే దీన్ని వ్యతిరేకించాయి. లక్నో సమావేశంలో యూపీ ఫైనాన్స్ మినిస్టర్ లేసి ‘బంద్ కరో’ అన్నరు. కేంద్రం తోక ముడిసింది. నీట్ అంశంపై స్టాలిన్ నాకు ఉత్తరం రాశారు. హక్కుల విషయంలో కేంద్రంతో పోరాడాల్సి వస్తే పోరాడతాం.