‘మనమంతా సమష్టిగా పనిచేసినప్పుడే సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, అధికారం, సంపద పంపిణీ సక్రమంగా జరుగుతాయి’
-నెల్సన్ మండేలా
మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను దళితుల పేరుతో బాధ పెట్టే వ్యవహారం మంచిది కాదు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతిఒకరి బాధ్యతగా భావించిన నాడే దళిత సాధికారత సాధ్యం అవుతుంది.
–ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): దళితోద్యమ చైతన్యానికి తెలంగాణ సర్కారు ఆత్మగౌరవ నగిషీలు అద్దుతున్నది. అన్ని రంగాల్లో ఎస్సీలు సమున్నతంగా ఎదిగేందుకు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. ఏడేండ్లలో రూ.55,438 కోట్లు ఖర్చుచేసి ఎస్సీల అభ్యున్నతికి దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని ప్రాధాన్యం ఇచ్చింది. కొత్తగా రూ.1000 కోట్లతో దళిత్ ఎంపవర్మెంట్ స్కీంతో దళితుల సముద్ధరణలో దేశానికి మార్గం చూపే ప్రయత్నం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్తో ఆ వర్గాలకు పెద్దగా ప్రయోజనం కలుగలేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలోనే తొలిసారి 2017లో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చుచేయలేకపోతే అవి తర్వాతి ఏడాదికి బదిలీ చేయటమే ఈ చట్టం ప్రత్యేకత. అంతకుముందు ఇలాంటి విధానం లేక దళిత వర్గాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయి. ఈ విప్లవాత్మక చట్టంపై కర్ణాటక, ఏపీ, ఒడిశా తదితర రాష్ర్టాలు అధ్యయనం చేస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఇటీవలే ఇలాంటి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించటం విశేషం.
స్వరాష్ర్టాన్ని సాధించుకున్న ఏడేండ్లల్లో రెండేండ్లు కరోనా కష్టాలు వచ్చినా, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా సమాజంలోని అట్టడుగువర్గాల అభివృద్ధి విషయంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. ఎస్సీ యువత ఆర్థికంగా స్థిరపడేందుకు చేపట్టిన ఆర్థిక చేయూత కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతూ జీవనోపాధి చూపిస్తున్నాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఎస్సీ యువతకు శిక్షణను ఇచ్చి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నది. అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో ఎస్సీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకాలకు తోడు సీఎం కేసీఆర్ ఇటీవల రూ.1,000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో దళిత సంక్షేమంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సంపద ఎంత భారీగా సృష్టించామన్నది కాకుండా.. ఆ సంపదను ఎంత సమర్థంగా, వ్యూహాత్మకంగా పంపిణీ చేశామన్నదానిపైనే ఒక సమాజం ప్రగతి ఆధారపడి ఉంటుంది. అట్టడుగు వర్గాలను పేదరికం నుంచి బయటపడేయటానికి ప్రభుత్వాలు వేసే ప్రతి అడుగు సమాజం మొత్తాన్ని సమస్యల నుంచి బయటపడేసేవైపు నడిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఇదే జరుగుతున్నది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కనీవిని ఎరగనిరీతిలో ప్రభుత్వం నిర్మిస్తున్నది. 11.4 ఎకరాల సువిశాల స్థలంలో పార్లమెంట్ను పోలిన 50 అడుగుల వేదికపై 125 అడుగుల ఎత్తు (పీఠంతో కలిపి 175 అడుగులు)తో, 45.5 అడుగుల వెడల్పుతో రూ.146.50 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నది. విగ్రహ నిర్మాణానికి 791 టన్నుల స్టీలు, 96 టన్నుల ఇత్తడి వినియోగించనున్నారు. విగ్రహానికి అవసరమయ్యే రాయిని రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి తెప్పిస్తున్నారు.
ప్రభుత్వం దళిత యువతకు వివిధరంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ బోరబండలోని ఇందిరానగర్లో 9 అంతస్తులతో ఆధునిక విజ్ఞాన కేంద్రాన్ని నిర్మిస్తున్నది. దేశంలోనే తొలి దళిత మ్యూజియం ఇక్కడ ఏర్పాటుకానున్నది. ఈ భవనంలో 26 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు మంజూరు చేసింది.
ఉమ్మడిరాష్ట్రంలో ఎస్సీలకు 134 విద్యాసంస్థలుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో 134 ఏర్పాటు చేసి దళిత విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ గురుకులాలను వందశాతం పెంచి దేశానికి దిక్చూచిగా మారింది. గురుకులాల్లో 30 మహిళా డిగ్రీ కళాశాలలు కావడం విశేషం. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే ఎస్సీ విద్యార్థులను పోత్సహించేందుకు ఉమ్మడిరాష్ట్రంలో అందించిన రూ.10 లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 లక్షలకు పెంచింది. ఈ పథకంలో ఇప్పటి వరకు 603 మంది లబ్ధి పొందారు.