మారుతున్న కాలానికి అనుగుణంగా సురభి సంస్థలు తమ పంథాను మార్చుకుంటూ నాటక ప్రియులను అలరించేందుకు కృషి చేస్తున్నాయి. గడచిన 135 ఏళ్లలో తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో వేల మంది మధ్య నాటకాలను ప్రదర్శించిన సురభి కళాకారులు, ఈ కళ అంతరించి పోకూడదన్న లక్ష్యంతో తక్కువ మంది వచ్చినా ప్రదర్శనలు చేస్తున్నారు. కరోనా నేర్పిన పాఠంతో.. చాలా వరకు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను పలు సంస్థలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నాయి. ఆ కోవలోనే సురభి నాటక సంస్థల్లో ఒకటైన శ్రీవెంకటేశ్వర సురభి థియేటర్స్ సంస్థ ఆన్లైన్ వేదికగా నాటకాలను ప్రదర్శిస్తున్నది. దీంతో నాటకాభిమానులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మొబైల్ ఫోన్లోనే ఆన్లైన్ ప్రత్యక్ష నాటక ప్రదర్శనలను వీక్షించే అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా, సురభికి చెందిన వినాయక నాట్యమండలి సంస్థ వనస్థలిపురంలో ఏప్రిల్ 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు నాటక ప్రదర్శనలను చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘బుక్ మై షో’ యాప్ ద్వారా ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న ప్రారంభించిన ఈ ఆన్లైన్ నాటక ప్రదర్శనలు ఏప్రిల్ 27వరకు కొనసాగనున్నాయి. నెల రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, 9 గంటలకు రెండు ప్రదర్శనలను ఆన్లైన్లో ప్రదర్శిస్తారు. వీటి ప్రసారం కొరకు వెంకటేశ్వర సురభి థియేటర్స్ వేదికపై నాటకాలను ప్రత్యేకంగా మూడు వీడియో కెమెరాలను ఉపయోగించి హెచ్డీ క్వాలిటీతో చిత్రీకరిస్తున్నట్లు నిర్వాహకుడు సురభి జయచంద్ర వర్మ పేర్కొన్నారు. ‘శ్రీవెంకటేశ్వర ఉద్భవం, శ్రీకృష్ణ లీలలు, భక్త ప్రహ్లాద, జై పాతాళ భైరవి, బాల నాగమ్మ, వీరబ్రహ్మం గారి చరిత్ర, కనకతార, కాంతామతి’ వంటి పలు నాటకాలను ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సురభికి చెందిన వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు వనస్థలి పురం హుడా ఓపెన్ ఆడిటోరియం మైదానంలో పలు పౌరాణిక, చారిత్రక నాటకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకుడు ఆర్.వేణుగోపాల్రావు తెలిపారు. 40 మంది కళాకారులతో ప్రతిరోజూ ఒక నాటకాన్ని ప్రదర్శిస్తామన్నారు. ఏప్రిల్ 11న శ్రీనివాస కళ్యాణం, 12న మాయాబజార్, 13న భక్త ప్రహ్లాద, 14న శ్రీకృష్ణ లీలలు, 15న పాతాళభైరవి, 16న శ్రీకృష్ణ తులాభారం, 17న శ్రీరామరాజ్యం, 18న బాలనాగమ్మ, 19న సత్యా హరిశ్చంద్ర, 20న సతీసావిత్రి, 21న కనకతార నాటకాలను ప్రదర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రేక్షకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని, తక్కువ సంఖ్యలో వీక్షకులు వచ్చినా రోజువారి నాటకాలను ప్రదర్శిస్తామని వేణుగోపాల్రావు చెప్పారు.