మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్కు సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) రచనలు ఎంతో ఇష్టమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే సినారె అంత్యక్రియల్లో కేసీఆర్ స్వయంగా పాడెమోసి తన అభిమానాన్ని చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం ప్రముఖ కవి, సాహితీవేత్త సినారె 90వ జయంతి కార్యక్రమంలో సినారె చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినారె కవిగా, సినీగేయ రచయితగా పలు పక్రియల్లో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని గంగా-జమునా తహజీబ్కు ప్రతీకగా నిలిపారన్నారు. ఎంపీగా, పలు యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్గా ఆయన విశేషసేవలు అందించారని కొనియాడారు. సినారె సారస్వత సదనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, సినారె కుటుంబ సభ్యులు భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గంధం రాములు పాల్గొన్నారు.