మత్స్యకార కులాలైన గంగపుత్ర, ముదిరాజ్ల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఈ రెండు కులాల ప్రతినిధులతో సమావేశాన్ని మత్స్యశాఖ నిర్వహించింది. వృత్తిపరమైన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే ఒక వేదికను సిద్ధం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.
కులాలు, వాటికి సంబంధించిన ప్రత్యేక వృత్తుల్లో కొనసాగుతున్న వివిధ ఉపకులాల మధ్య అంతర్గత వైరుధ్యాలు సాధారణమే. ఇదేవిధంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలలో మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కులాలు, ఉపకులాల్లో పలు అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. అయితే కేంద్రంతో పాటు, కొన్ని ఉత్తరాది రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాలు మత్స్యరంగం అభివృద్ధి పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో మత్స్యకారకులాలతో పాటు ఇతర కులాల వారిని కూడా పరిగణన లోకి తీసుకుంటున్నారు. దీనివల్ల సమస్య మరింత జటి లమవుతున్నది. కానీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం గుర్తించిన గంగపుత్ర, ముదిరాజ్ కులాలు.. వాటి ఉపకులాల నుంచి గుర్తింపు పొందిన అభ్యర్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. మత్స్యసహకార సొసైటీలలో సభ్యత్వం విషయంలోనూ ఇవే నిబంధనలను అమలుపరుస్తున్నారు. గత మూడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో అమల్లోకి తీసుకువచ్చిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ కింద మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.
కాళేశ్వరంతోపాటు మిషన్ కాకతీయ ఫలితంగా రాష్ట్రం లో జలవనరులు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణలో చేపల పెంపకానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. భవిష్యత్తులో మత్స్యసంపద గణనీయంగా పెరగడంతోపాటు మత్స్యకార కులాలకు ఆదాయ వనరులు కూడా వృద్ధి చెం దుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తెలంగాణ అవతరించే నాటికి రాష్ట్రంలో వార్షిక చేపల ఉత్పత్తి 2.5 లక్షల మెట్రిక్ టన్నులే. వచ్చే ఐదేండ్ల్లలో చేపల ఉత్పత్తిని కనీసం 10 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. సమగ్ర మత్స్య విధానాన్ని రూపొందించి అమలుపర చాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.
రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువైన మొత్తం నీటి విస్తీర్ణం కాళేశ్వరంతో కలుపుకొని సుమారు 17.5 లక్షల ఎకరాలు. గతంలో రెండున్నర ఎకరాల నీటి విస్తీర్ణానికి ఒకరికి చొప్పున సభ్యత్వం ఇచ్చేవిధంగా నిబంధనలు ఉం డేవి. వీటిని సవరించి ఎకరానికి ఒకరికి చొప్పున సభ్య త్వం ఇచ్చేందుకు వీలుగా 2016లో జీవో నంబర్ 6 వెలువరించారు. ఈ ప్రకారం మత్స్యసహకార సంఘాల్లో మొత్తం 17.5 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకునే అవకాశం ఉంది. గత జూన్ నాటికి అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 4,634 మత్స్య సహకార సంఘాల్లో 3,36,799 మంది సభ్యులున్నారు. కాబట్టి పాత నిబంధనల ప్రకారమైనా ఇంకా 4 లక్షల మందికి అదనంగా సభ్యత్వం ఇవ్వొచ్చు.
దేశవ్యాప్తంగా అధునాతన పరిశ్రమగా మత్స్యరంగం రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో మత్స్యరంగంలో ఉన్నవాళ్లు ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకోవాలి. మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకునే స్థాయిలో తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ప్రభుత్వం రెండు ప్రధాన కులాలను సమన్వయపరిచే ప్రయత్నం సానుకూల ఫలితాలను సాధిస్తుందని ఆశిద్దాం! భవిష్యత్లో మత్స్యరంగం మరిం త అభివృద్ధిని సాధించడానికి ఈ ప్రయత్నం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’వ్యవస్థాపక అధ్యక్షులు)
–పిట్టల రవీందర్