ఆ గ్రామంలో అడుగడుగున ఓ చారిత్రక ఆనవాలు దర్శనమిస్తుంది. అక్కడి శిలలు కాకతీయుల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. గుళ్లు, గోపురాలు ఆనాటి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెబుతాయి. రమణీయ శిల్పకళా సౌంద్యరంతో అలరారే ఆలయాలు, ప్రకృతి అందాలు మొగిలిచర్లకు వచ్చిన పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కాకతీయుల ఏలుబడిలో ఈ గ్రామం సైనిక స్థావరంగా, మహానగరంగా విలసిల్లిందని చెప్పే అనేక చారిత్రక సాక్ష్యాలు ఇక్కడ దర్శనమిస్తాయి.
వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో ఉంటుంది మొగిలిచర్ల గ్రామం. ఓరుగల్లు కోటకు ఈశాన్య దిశలో ఉన్న మొగిలిచర్లతో కాకతీయ ప్రభువులకు ఎనలేని సంబంధం ఉండేది. అప్పట్లో ఈ గ్రామాన్ని ‘కేతకి తటాకపురం’ అనేవారు. గ్రామ సమీపంలోని చెరువులో మొగలి పూలు విరివిగా పూసేవట. వాటితోనే ఏకవీరాదేవికి పూజలు చేసేవారట ప్రభువులు. అలా ఈ ప్రాంతానికి ‘మొగిలిచర్ల’ అన్న పేరొచ్చింది.
కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి తరచూ మొగిలిచర్ల వచ్చేదట. ఏకవీరాదేవిని పూజించేందుకు నెలకు ఐదు రోజులు ఇక్కడే గడిపేవారని సిద్ధేశ్వర చరిత్ర ద్వారా తెలుస్తున్నది. రుద్రమదేవి కుమార్తె ముమ్మడమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు ఏకవీరాదేవి ఆలయంలో మూడు రోజులపాటు వ్రతం చేసిందనీ చెబుతారు. అదే సమయంలో రుద్రమను మట్టుబెట్టేందుకు హరిహర మురహరిదేవులు కుట్ర చేయగా.. వేగుల ద్వారా సమాచారం అందుకొని వారిని ఇదే ప్రాంతంలో మట్టు బెట్టిందని చరిత్రకారుల అభిప్రాయం.
మొగిలిచర్లలో ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. గ్రామంలోకి ప్రవేశించగానే పశ్చిమ చెరువు, ఆ పక్కనే కాకతీయులు నిర్మించిన శివాలయం కనిపిస్తుంది. అందులోని శివలింగం, మూడు నందీశ్వర విగ్రహాలు, వినాయకుడు, ఆంజనేయుడి ప్రతిమలు అద్భుత శిల్ప సౌందర్యంతో కట్టిపడేస్తాయి. గ్రామానికి వాయవ్య దిశలో పచ్చని నేల మధ్య పెద్దరాతిపై నిర్మితమైన ఏకవీరాదేవి (రేణుక) ఆలయం ఉన్నది. దీనికి ఎదురుగా కూలిపోయిన మహాద్వారం ఆనవాళ్లు దర్శనమిస్తాయి. ఆలయం పైకప్పు 28 రాతి స్తంభాలపై నిలిచి ఉంది. గుడిలో నాట్యమంటపం, గర్భాలయంలో ప్రత్యేకమైన రెండు స్తంభాలతోపాటు అంతరాలయం కనిపిస్తాయి. గర్భగుడిలో అలనాటి ఏకవీరాదేవి విగ్రహం లేదు. కానీ, కుండలాలు, కంఠాభరణం, దండకడియాలు ధరించి చతుర్భుజాలు కలిగిన దేవతా ప్రతిమ దర్శనమిస్తుంది. ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పాన పాత్ర ధరించిన అమ్మవారి విగ్రహం గంభీరంగా ఉంటుంది. నేరుగా చూస్తే ఒడలు పులకరిస్తాయి. తెలియని గగుర్పాటు కలుగుతుంది.
మొగిలిచర్ల ప్రధాన ప్రవేశద్వారానికి సమీపంలోనే వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది. ఇదే ప్రాంగణంలో లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ శకలాలున్నాయి. ప్రవేశద్వారం గోడకు సప్తమాత్రికలు, రెండు సింహాల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. గ్రామానికి తూర్పున కాకతీయులు నిర్మించిన భక్తాంజనేయస్వామి ఆలయం ఉన్నది. గ్రామం నడిబొడ్డున కాకతి, నాగప్రతిమలు, నందీశ్వర్వుడు, సూర్యుడు, నరసింహస్వామి విగ్రహాలు, శాసనం కనిపిస్తాయి. ఏకవీర ఆలయం ఎదుట ఐదు రాతి గుహలున్నాయి. గ్రానైట్ రాయిని తొలచి ఏర్పాటు చేసిన ఈ గుహలకు చిన్న ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఒక్కో గుహలో ముగ్గురు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఇందులోంచి నీళ్లు బయటకు వెళ్లేలా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థనూ ఏర్పాటు చేశారు. ఈ గుహలకు సమీపంలో ఓ స్త్రీ శిల్పం కనిపిస్తుంది. ఓ చేతిలో పడగవిప్పిన నాగుపాము, మరోచేతిలో పాత్ర ధరించిన ఈ మూర్తి మానసాదేవిదని కొందరు, ఎవరో మంత్రసిద్ధురాలిదని మరికొందరు వాదిస్తారు.
అనంత శిల్ప సంపదతో, అనేక చారిత్రక విశేషాలను తనలో ఇముడ్చుకున్న మొగిలిచర్ల గ్రామంలో నాలుగు శిలా శాసనాలున్నాయి. వీటిలో ఏముందన్నది ఎవరూ పరిశోధించ లేదు. వాటి విశిష్టతను తెలుసుకుంటే ఈ ప్రాంత వైభవం మరింత వెలుగులోకి వస్తుంది.
-కొత్త రమేశ్