కరీంనగర్ : కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ జెండాతోనే హుజురాబాద్లో గెలువబోతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హుజురాబాద్ 16 ,17 వ వార్డుల్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రైతుబందు, రైతుబీమా, ఇరవై నాలుగు గంటల కరెంటు, కళ్యాణలక్ష్మి, ఆసరా ఫించన్లు, దళితబంధు ఇలా వందల సంఖ్యలో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు.
మోటర్లకు మీటర్లు పెడుతామంటూ వ్యవసాయ నల్లచట్టాల్ని తీసుకొచ్చిన బీజేపీకి ఓటేయద్దని విజ్ణప్తి చేసారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని రోజు రోజుకు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. రాష్ట్రంలో రాజాసింగ్, రఘునందన్ రెండు ఆర్లు గెలిపించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు మూడో ఆర్ రాజేందర్ను అసెంబ్లీకి పంపే అవకాశమే లేదన్నారు.
గతంలో కారు గుర్తుకే ఓటేసారని, ఈసారి అంతకంటే అత్యధిక మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడన్నారు. వాడ వాడల తిరుగుతూ ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి గంగుల ప్రచారం నిర్వహించారు. ప్రజల సైతం టీఆర్ఎస్ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు.
కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గందే రాధిక, స్థానిక కార్పొరేటర్లు సుశీల, ఉజ్మ- ఇమ్రాన్, స్థానిక నాయకులు జమీలుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.