కరోనా పరిస్థితుల్లో ప్రజలకు హైదరాబాద్ మెట్రో సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా సేవలందిస్తున్నది. మెట్రోను మరింత సమర్థంగా నడిపేలా చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రప్రభుత్వం తరఫున తగిన సహకారమందిస్తాం.
–ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల్లో ప్రజలకు హైదరాబాద్ మెట్రో సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా సేవలందిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. మెట్రోను మరింత సమర్థంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రప్రభుత్వం తరఫున తగిన సహకారమందిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ఎల్అండ్టీ సంస్థ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. కరోనా కారణంగా నష్టాల్లో నడుస్తున్న మెట్రోకు సహకారమందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమీక్ష నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు మహమూద్అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డీకె సేన్, ప్రాజెక్టుల సీఈవో అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈవో కేవీబీ రెడ్డి పాల్గొన్నారు.